Telugu Gateway
Andhra Pradesh

టీడీపీలో ప‌య్యావుల కేశ‌వ్ ది ప‌ర్స‌న‌ల్ ఏజెండా?!

టీడీపీలో ప‌య్యావుల కేశ‌వ్ ది ప‌ర్స‌న‌ల్ ఏజెండా?!
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌..ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏ అంశంపై ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించాల్సి వ‌చ్చినా వాళ్లు నేరుగా సీఎం జ‌గ‌న్ నే టార్గెట్ చేస్తారు. ఇది స‌రైన‌దా..కాదా అన్న అంశాన్ని కాసేపు ప‌క్క‌న పెడితే టీడీపీ నేత‌లు అంద‌రూ ఒక్క ప‌య్యావుల కేశ‌వ్ మిన‌హాయించి నేరుగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. సీనియ‌ర్ నేత‌..పీఏసీ ఛైర్మ‌న్ గా ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ మాత్రం ప్ర‌తిప‌క్షంలోకి వచ్చాక చాలా రోజులు సైలంట్ గా ఉన్నారు. త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వంలో ఆర్ధిక అవ‌క‌త‌వ‌క‌లు అంటూ ప‌లుమార్లు మీడియా ముందుకు వ‌చ్చారు. ఇలా వ‌చ్చిన ప్ర‌తిసారి ఆయ‌న ఎక్క‌డా పెద్ద‌గా సీఎం జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించ‌కుండా..ఎంత సేపూ వైసీపీ ప్ర‌భుత్వం..ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి..ఆర్ధిక శాఖ అధికారులపై విమ‌ర్శ‌లు చేశారు త‌ప్ప‌..ఎక్క‌డా ఆర్ధిక అవ‌క‌త‌వ‌క‌ల విమ‌ర్శ‌ల‌పై సీఎం జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించ‌లేదు. ఇది అప్ప‌ట్లోనే టీడీపీలో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ ప్ర‌భుత్వం అంటూ మాట్లాడారే త‌ప్ప..ఇత‌ర నేత‌ల‌కు భిన్నంగా జ‌గ‌న్ పై విమ‌ర్శ‌ల‌కు మాత్రం దూరంగా ఉండేవారు. సౌర ఇంథ‌న విద్యుత్ ప్రాజెక్టుల‌కు సంబంధించి కూడా ఏపీ ప్ర‌భుత్వం చేసుకున్న ఒప్పందాల‌పై ప‌య్యావుల కేశ‌వ్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అందులోనూ సేమ్ మోడ‌ల్ ఫాలో అయ్యారు. ఎంత‌సేపు వైసీపీ ప్ర‌భుత్వం..విద్యుత్ శాఖ అధికారుల గురించి ప్ర‌స్తావించారే త‌ప్ప సీఎం జ‌గ‌న్ పేరు తీసేవారు కాదు.

టీడీపీ హ‌యాంలో అయితే ఏ నిర్ణ‌యం అయినా చంద్ర‌బాబు అభిమతం మేర‌కే జ‌రుగుతుంద‌నే విష‌యం తెలిసిందే. అలాగే వైసీపీ హ‌యాంలో సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్న‌ల్లో నిర్ణ‌యాలు జ‌రుగుతాయి. ఇది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అయినా స‌రే ప‌య్యావుల కేశ‌వ్ మాత్రం సీఎం జ‌గ‌న్ పై ఎక్క‌డా విమ‌ర్శలు చేయ‌కుండా వ‌చ్చారు. ఇప్పుడు కార‌ణాలేమిటో కానీ విద్యుత్ స్కామ్ అంశాన్ని వ‌దిలేశారు..ఆర్ధిక అంశాల‌పై మాత్రం అప్పుడు వైసీపీ ప్ర‌భుత్వం..అధికారులు అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా లేపాక్షి భూముల వ్య‌వహారంలో ప‌య్యావుల కేశ‌వ్ నేరుగా సీఎం జ‌గ‌న్ పేరును ప్ర‌స్తావించ‌టం టీడీపీ నేత‌ల‌ను కూడా ఒకింత షాక్ కు గురిచేసింద‌నే చ‌ర్చ సాగుతోంది. ఇంత కాలం ప్ర‌భుత్వం ప్ర‌భుత్వం అంటూ మాట్లాడి ఇప్పుడు నేరుగా సీఎం జ‌గ‌న్ పై ప‌య్యావుల కేశ‌వ్ నేరుగా విమ‌ర్శ‌లు చేయ‌టం వెన‌క వ్య‌క్తిగ‌త ఏజెండా ఉంద‌నే వ్యాఖ్య‌లు ఆ పార్టీ నేత‌ల నుంచే విన్పిస్తున్నాయి. ప‌ది వేల కోట్ల రూపాయ‌ల భూమిని 500 కోట్ల రూపాయ‌ల‌కే ఇస్తారా..ఈ కుట్ర అంతా సీఎం క‌నుస‌న్న‌ల్లోనే సాగింద‌ని కేశ‌వ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రి ఈ అంశంపై అయినా ఓ తార్కిక ముగింపు వ‌ర‌కూ ప్ర‌య‌త్నం చేస్తారా..లేక గ‌తంలో మాదిరే మ‌ధ్య‌లోనే వ‌దిలేస్తారా అన్న‌ది వేచిచూడాల్సిందే.

Next Story
Share it