పవన్ అలా చెపితే ఇలా ప్రభుత్వాలు ఏర్పాటు అవుతాయా?
ఇక తగ్గను అంటున్న జనసేన అధినేత
ఎవరు తగ్గుతారో చూడాల్సిందే
ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. ఇంత కాలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానంటూ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చారు. పవన్ తెచ్చిన మూడు ప్రతిపాదనల్లో అసలు రెండు ప్రాథమిక దశలో పెయిల్ అయ్యేవే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన అలా చెపితే ఇలా ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయన్న తరహాలో స్పందించినట్లు కన్పిస్తోంది. ఏది ఏమైనా పవన్ ప్రతిపాదనలు చూస్తుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఇరకాటంలోకి పెట్టేందుకే అన్న చర్చ సాగుతోంది. శనివారం నాడు మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ముందు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి . బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, రెండవది . జనసేన + బీజేపీ + టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, మూడవది జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం ఈ ప్రతిపాదనలు అని తెలిపారు. బీజేపీ- జనసేన బంధం గట్టిగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా కొంత సోషల్ డిస్టెన్స్ వచ్చిందని, ఇప్పుడది పోయిందని తెలిపారు. ఇటీవల బీజేపీ జాతీయ నేతలతో కూడా చర్చించానని వెల్లడించారు.
తాను సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలెవరూ చెప్పలేదని తెలిపారు. పొత్తులపై తనను అందరూ అడుగుతున్నారని చెప్పారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతానని ప్రకటించారు. రాష్ట్రం కోసం చాలాసార్లు తగ్గానని, ఈసారి మిగతావాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. 2014, 2019లో తగ్గాం.. 2024లో తగ్గేదే లేదని పవన్ తేల్చిచెప్పారు. మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తి అని పవన్ గుర్తుచేశారు. టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదని పవన్ సూచించారు. 'బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారనే విషయం నాకు తెలియదు. దీని గురించి నాతో మాట్లాడలేదు' అని పవన్ వ్యాఖ్యానించారు. ఒంటరిగానే పోటీచేసి మళ్లీ అధికారంలోకి వస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని చెబుతూ... ''ఒంటరిగా పోటీ చేసే మీకు... ప్రత్యర్థి పార్టీలు ఎవరెవరు కలిస్తే మీకెందుకు?'' అని పవన్ ప్రశ్నించారు.