Telugu Gateway
Andhra Pradesh

ఇది అదే సంకేతమా!

ఇది అదే సంకేతమా!
X

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమానంగా మంత్రి నారా లోకేష్ కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. క్యాబినెట్ సమావేశాల్లో చంద్రబాబు కు ఒక వైపు పవన్ కళ్యాణ్ ..మరో వైపు సీనియర్ నాయకులు, మంత్రులను కూడా కాదని నారా లోకేష్ కు సీటు కేటాయించిన విషయం తెలిసిందే. నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు పై పెద్ద ఎత్తున ఒత్తిడి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకమైన విశాఖపట్నం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాధ్యతలు నారా లోకేష్ కు అప్పగించే అవకాశం ఉంది అని విస్తృతంగా ప్రచారం జరిగింది.

కానీ అందుకు బిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు మాత్రమే జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాధ్యతల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇది కూడా త్వరలోనే నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు అనటానికి సంకేతమా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో మొదలైంది. వీళ్లిద్దరికీ మినహాయింపు ఇవ్వటం వల్ల కొంత మంది మంత్రులకు రెండు జిల్లాల ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాధ్యతలు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి, అనకాపల్లి జిల్లా బాధ్యతలు కొల్లు రవీంద్ర కు కేటాయించారు. తిరుపతి జిల్లా బాధ్యతలు అనగాని సత్యప్రసాద్, చిత్తూర్ జిల్లా బాధ్యతలు మందపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కి ఇచ్చారు. తాను నేరుగా ఇన్ ఛార్జ్ మంత్రిగా ఉండి అనుకున్న పనులు చేయించుకోవటం కంటే వేరే వాళ్ళను ముందు పెట్టి నడిపించుకోవటం కోసమే ఇలా చేశారు అనే చర్చ కూడా టీడీపీ వర్గాల్లో సాగుతోంది.

Next Story
Share it