Telugu Gateway
Andhra Pradesh

జగన్ మీడియా..సిమెంట్ వ్యాపారాలు వదిలేస్తే..నేను సినిమాలు మానేస్తా

జగన్ మీడియా..సిమెంట్ వ్యాపారాలు వదిలేస్తే..నేను సినిమాలు మానేస్తా
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా మాట్లాడితే చొక్కా పట్టుకుని నిలదీసే రోజులు ఇవని..జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 'సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు.. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. ' అని వ్యాఖ్యానించారు. నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. వైసీపీ నేతలు పేకాట క్లబులు నడుపుతున్నంత సమర్ధవంతంగా ప్రజల అవసరాలను తీర్చడంలో విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

ఓడిపోయాక భయపడిపోతాం, పారిపోతాం అని కొందరు భ్రమ పడుతున్నారు... ఆశయం ఉన్నవాడికి ఓటమి ఉండదు, ముందడుగే ఉంటుందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా బాధ్యతగా వ్యవహరించకపోతే, వాళ్లు ఏ స్థాయి వ్యక్తులైనా రోడ్ల మీదకు తీసుకురాగల సత్తా జనానికి ఉందని స్పష్టం చేశారు. ప్రజలను భయపెట్టి పాలిద్దాం అంటే సహించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు. "నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరగాలని కృష్ణాజిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వాలని మచిలీపట్నం వెళ్తున్నాను. అందులో భాగంగా మొదటసారి గుడివాడ వచ్చాను. జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతం పలికారు. ఈ అనుభూతిని చివరి శ్వాస వరకు గుర్తు పెట్టుకుంటాను.

అన్ని కులాలు, అన్ని మతాలకు సమ న్యాయం జరగాలనే జనసేన పార్టీ స్థాపించాను. కంకిపాడు నుంచి గుడివాడ వచ్చే దారిలో రోడ్లు అస్తవ్యవస్థగా ఉన్నాయి. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నించాలి. నిలదీయాలి. దాష్టీకానికి పాల్పడుతూ, నోటి దురుసుతో మాట్లాడే ఏ ప్రజాప్రతినిధినైనా జనసేన పార్టీ బలంగా ఎదుర్కొంటుంది. గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నాను... అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతాను. కౌలు రైతులను ఎవరూ పట్టించుకోవటంలేదని విమర్శించారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కార్మికులు చనిపోతే కోటి రూపాయలు ఇచ్చారు..కానీ రైతులు చనిపోతే మాత్రం ఏడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.

Next Story
Share it