Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ విశాఖ ఉక్కు కోసమా.. తిరుపతి సీటు కోసమా?

పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ విశాఖ ఉక్కు కోసమా.. తిరుపతి సీటు కోసమా?
X

వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ, జనసేనపై తీవ్ర విమర్శలు చేశారు. అందరూ కలసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన సమయంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వైజాగ్‌ స్టీల్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుండటం చాలా బాధాకరమన్నారు. ఆయన గురువారం నాడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఈ అంశంపై పోరాటం చేయాల్సింది పోయి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అసలు వైజాగ్‌ స్టీల్స్‌ ప్రైవేటీకరణకు తొలి అడుగు చంద్రబాబు హయాంలోనే పడిందన్నారు.

విశాఖ ఉక్కును కాపాడుకుంటామని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్.. ఆ దిశగా ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. బీజేపీతో జతకట్టిన జనసేనానికి కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్లేది విశాఖ ఉక్కు కోసమా.. లేక తిరుపతి సీటు కోసమా అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉండవని తెలిసి కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. విశాఖ ఉక్కును రాష్ట్ర ప్రభుత్వం అమ్మే అవకాశం ఉంటే చంద్రబాబు ఎప్పుడో ఆ పని చేసే వాడని విమర్శించారు. అప్పటి వరకు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు చంద్రబాబు అధికారంలోకి రాగానే నష్టాల్లోకి వెళ్ళిందన్నారు.

Next Story
Share it