Telugu Gateway
Andhra Pradesh

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు

మళ్ళీ బతికిస్తామని..ఇద్దరు కూతుళ్ళను చంపేశారు
X

ఆ పని చేసింది బయటవాళ్ళెవరో కాదు. స్వయంగా ఆ అమ్మాయిల తల్లిదండ్రులే. మళ్ళీ బతికిస్తామని చెప్పి..ఇద్దరు కూతుళ్ళను దారుణాతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఏమైనా నిరక్ష్యరాసులా అంటే అదీ కాదు. పిల్లలకు పాఠాలు చెప్పే కాలేజీ, స్కూళ్ళలో ఉన్నత హోదాల్లో ఉన్నవారే. మరి ఈ పని ఎందుకు చేశారు?. దీనికి కారణాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. మదనపల్లి పట్టణంలోని టీచర్స్‌ కాలనీ శివనగర్‌లో వి. పురుషోత్తం నాయుడు, పద్మజ ఉంటారు. పురుషోత్తం నాయుడు ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ పనిచేస్తుంటే..పద్మజ మాస్టర్‌ మైండ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) ఇద్దరు కుమార్తెలు. పద్మజకు విపరీతమైన భక్తి భావాలు, మూఢనమ్మకాలు ఉన్నాయని స్థానికుల కథనం.

ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలోనే వ్యాయామానికి ఉపయోగించే డంబెల్స్‌ సహాయంతో తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలను అతికిరాతకంగా మోది హత్యచేశారు. అనంతరం తల్లిదండ్రుల అరుపులు, కేకలతో విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు తల్లిదండ్రులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 'సత్యలోకం తిరిగి వస్తుంది. మా బిడ్డలను మేం తిరిగి బతికించుకుంటాం.. ఒకరోజు గడువు ఇవ్వండి, మా పిల్లలు లేచి వస్తారు'అని ఆ తల్లిదండ్రులిద్దరూ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మాటలు విన్న పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it