కూటమిలో గందరగోళమా...కావాలనే చేస్తున్నారా?!

అమరావతి ఫేజ్ టూ కి అదనపు భూములు అవసరం. అమరావతి లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , స్పోర్ట్స్ సిటీ రాకపోతే ఇక్కడ పెరిగిన భూముల ధరల నిలబడవు..మరింత పెరగవు. ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పదే పదే మీడియా సాక్షిగా ఆన్ రికార్డు ఈ మాట చెపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వందేళ్ల గురించి ఆలోచిస్తున్నారు అని ఒక సారి...ఏభై సంవత్సరాల గురించి ఆలోచిస్తున్నారు అని ప్రకటించారు మంత్రి నారాయణ. తొలి సారి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రాజధాని విస్తరణ ప్రాజెక్ట్ గురించి సోమవారం నాడు అమరావతి రైతులతో మాట్లాడినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. హైదరాబాద్ మహానగరంలా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండటం ఎంతో అవసరం అని..అదనపు భూ సేకరణ వల్ల అమరావతిలో భూముల ధరలు పడిపోతాయనేది అపోహ మాత్రమే అని చంద్రబాబు రైతులతో మాట్లాడారు. అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో పాటు స్పోర్ట్స్ సిటీ అదనపు భూమి అవసరం అని...దీనికి అనుగుణంగా అదనపు భూసేకరణ తలపెట్టినట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ మాటలు ఇలా ఉంటే..కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కు చెందిన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపించారు. ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ కలిసి కృషి చేయాలి అంటూ ఆయన సోమవారం నాడు మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రంలో పాల్గొన్నారు. అక్కడ నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలు ఇలా ఉన్నాయి. అమరావతి లేకపోతే మనకు అడ్రస్ లేదు...వైసీపీ నాయకులు ప్రణాళికాబద్దంగా అమరావతి ని నాశనం చేశారు అని విమర్శించారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి కోసం 33 వేల ఎకరాలు కాకుండా మరో 44 వేల ఎకరాలు సేకరిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి అనుమానాలు, అపోహలు ఉంటే మరిచిపోండి. కూటమి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మా దృష్టంతా ప్రస్తుతం సేకరించిన 33 వేల ఎకరాల అభివృద్ధిపైనే ఉంది. సీఆర్డీఏ పరిధిలోనే రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాం. భవిష్యత్తులో అవసరాల కోసం భూమి సేకరించాలని కొంతమంది మాట్లాడినా ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం గానీ, ఆదేశాలుగానీ ఇవ్వలేదు.
దాని గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు నాదెండ్ల మనోహర్. కానీ దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ ప్రకటనలు ఉండటంతో అసలు కూటమి పార్టీలకు అయినా ఈ విషయంలో క్లారిటీ ఉందా అన్న చర్చ తెర మీదకు వచ్చింది. వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని కోసం 33 వేల ఎకరాల సమీకరణనే తప్పుపట్టారు. ఇప్పుడు చంద్రబాబు తొలిసారి అదనపు భూ సేకరణ విషయంపై రైతులతో మాట్లాడినందున జనసేన స్టాండ్ అధికారికంగా ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే ప్రభుత్వ ..అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడే ఛాన్స్ లేదు అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అందరూ...అన్ని విషయాల్లో ఒక అవగాహనతోనే కలిసి పనిచేసుకుంటున్నారు అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే అటు అమరావతి కాంట్రాక్టు ల దగ్గర ఇటు గ్రామీణ నీటి సరఫరా కాంట్రాక్టులు...విద్యుత్ ప్రాజెక్ట్ ల విషయంలో కూడా కూడబలుక్కుని అంతా ఒక మాట మీదే ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెపుతున్నారు.