Telugu Gateway
Andhra Pradesh

టార్గెట్ చిరంజీవి

టార్గెట్ చిరంజీవి
X

మెగా స్టార్ చిరంజీవి రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్న వేళ చిరంజీవి టీడీపీ, జన సేన, టీడీపీ కూటమి అభ్యర్థులుగా ఉన్న సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబు కు మద్దతుగా ఒక వీడియో విడుదల చేశారు. సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా అనకాపల్లి లోక్ సభ బరిలో ఉంటే...పంచకర్ల రమేష్ పెందుర్తి నుంచి జన సేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాని..దీనికి కారణం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జన సేన, బీజేపీ లు కలిసి కూటమి గా పోటీ చేయటం మంచి పరిణామం అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి తో సహా ఎంత మంది వచ్చినా తమకు ఏమీ కాదన్నారు. ఇప్పుడే అందరి ముసుగులు తొలగిపోయాయని...తమకు కూడా స్పష్టత వస్తుంది అన్నారు. మరో వైపు సోషల్ మీడియా లో వైసీపీ ఇప్పుడు చిరంజీవిని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది.

టార్గెట్ చిరంజీవితాజాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. అజాత శత్రువు అయిన చిరంజీవి విషయంలో సజ్జల ఇష్ఠానుసారం మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. చిరంజీవి వైసీపీ కి అనుకూలంగా మాట్లాడినప్పుడు తాను కనీసం స్పందించలేదు అని..కానీ వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు అన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో సినిమా హీరోల ఇష్యూలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారటం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఒక సారి చిరంజీవి ఎన్నికల్లో తన మద్దతు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కాకుండా మరొకరికి ఎందుకు ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయంలో తాను అసలు జోక్యం చేసుకోను అని..ఎటు వైపు కూడా ఉండను అని చెప్పారు. ఇప్పుడు మాత్రం చిరంజీవి టీడీపీ, జన సేన, బీజేపీ కూటమికి మద్దతుగా మాట్లాడటంతో వైసీపీ ఆగ్రహానికి కారణం అయింది.

Next Story
Share it