Telugu Gateway
Andhra Pradesh

వ్యాక్సిన్ వేయాలి..ఎన్నికలు కష్టం

వ్యాక్సిన్ వేయాలి..ఎన్నికలు కష్టం
X

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏపీ సర్కారు తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయ్యారు. అయితే అందుకు సర్కారు మాత్రం ససేమిరా అంటోంది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై మంగళవారం నాడు హైకోర్టు‌లో విచారణ జరిగింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది.

మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండవ డోస్ వేయాలని కేంద్రం సూచించిందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. అందువలన ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. వచ్చే శుక్రవానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉన్నందున ఆ సమయంలో పోలీసులు, ఇతర సిబ్బందిని కేటాయించటం సాధ్యం కాదని పేర్కొంది.

Next Story
Share it