Telugu Gateway
Andhra Pradesh

బ్యాంకుల విలీనం తరహాలో వైజాగ్ స్టీల్ విలీనం

బ్యాంకుల విలీనం తరహాలో వైజాగ్ స్టీల్ విలీనం
X

ఏపీ బిజెపికి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం సెగ తగిలింది. అందుకే ఢిల్లీలో ఈ నిర్ణయం తీసుకున్నది తమ ప్రభుత్వమే అయినా సరే వెళ్లి ప్రత్యామ్నాయం చూడండి కానీ ప్రైవేటీకరణ వద్దు అని కోరారు. ఏపీ బిజెపి నేతలు సోమవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ తో సమావేశం అయి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో ఆలోచించాలని కోరారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల విలీనం తరహాలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కూడా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిపారు.

సోము వీర్రాజు నేతృత్వంలోని బృందంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి ముందు నాలుగైదు ప్రతిపాదనలు పెట్టినట్లు పురంధేశ్వరి మీడియాకు వెల్లడించారు. ఎన్ఎండీసీ, సెయిల్ వంటి సంస్థల్లో విలీనం చేయటంతోపాటు ఐపీవో ద్వారా నిధులు సమీకరించాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రం ఎయిర్ ఇండియా వంటి సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తోందని తెలిపారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై నిర్ణయం తీసుకోవటానికి నిర్ధిష్ట గడువు ఏమీలేదన్నారు.

Next Story
Share it