Telugu Gateway
Andhra Pradesh

బీజేపీ గేమ్ ను గమనించే జన సేన నిర్ణయం తీసుకుందా?!

బీజేపీ గేమ్ ను గమనించే జన సేన నిర్ణయం తీసుకుందా?!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విషయంలో తెలుగు దేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం ఏపీలో జన సేన, బీజేపీ లు పొత్తు లో ఉన్నాయి. ఈ పొత్తు సంగతి పక్కన పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాము తెలుగు దేశం తో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. గతంలో చేసినట్లే బీజేపీ కూడా తమతో కలిసి రావాలని కోరుకుంటాను అని ...కానీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు. సమిష్టిగా కలిసి వెళితే జగన్ సర్కారు అరాచకాన్ని అడ్డుకోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ గురువారం నాడు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్న చంద్రబాబు తో నారా లోకేష్, నందమూరి బాల కృష్ణ తో కలిసి ములాఖత్ లో సమావేశం అయ్యారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ బీజేపీ విషయాన్నీ పక్కన పెట్టి మరి తాము మాత్రం కలిసి పోటీ చేస్తామని ప్రకటించటం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పుకోవాలి. మరి ఇప్పుడు బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నది కీలకంగా కాబోతోంది. ఎప్పటి నుంచో ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ కి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు ఆ పార్టీ అగ్రనాయకత్వం అంటే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు అండదండలు అందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారంలో ఉంది. దీంతో ఇప్పుడు బీజేపీ తీసుకోబోయే నిర్ణయం కూడా అత్యంత కీలకం కానుంది. బీజేపీ ని పక్కన పెట్టి మరి పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించటం అన్నది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశం. టీడీపీ, జనసేన లు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఎప్పటినుంచో ఉన్నా కూడా ఈ విషయంలో బీజేపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నది కీలకం అయిన తరుణంలో పవన్ కళ్యాణ్ మూవ్ ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీ వైసీపీ విషయంలో గేమ్ ఆడుతుంది అని గ్రహించే పవన్ తన నిర్ణయం తాను తీసుకున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.అయితే ఆ విషయం నేరుగా చెప్పకుండా తమతో బీజేపీ వస్తే మంచిది అని తాము కోరుకుంటున్నాం అని..చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర లేదు అని ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి కార్యాచరణ తో ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ మాత్రమే అని తేలిపోయింది. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగుతాయి అని ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పవన్ తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు తేల్చటంతో బీజేపీ ఇరకాటంలో పడినట్లు అయింది. మరి జనసేన తో బీజేపీ పొత్తు తెంచుకుంటుందా...లేక తర్వాత ఈ కూటమిలో చేరుతుందా అన్నది ఆసక్తికర పరిణామం కానుంది. లేదు బీజేపీ ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రచారంలో ఉన్నట్లు అధికార వైసీపీ, బీజేపీ ల మధ్య రహస్య స్నేహం ఉంది అనే విషయం మరింత బలోపేతం అవుతుంది అని చెపుతున్నారు. రాజకీయంగా అది బీజేపీకి. అటు వైసీపీ కి కూడా ఎంతో కొంత నష్టం కలిగించే అంశంగా మారుతుంది అని భావిస్తున్నారు.

Next Story
Share it