Telugu Gateway
Andhra Pradesh

వైసీపీలో ఇంకా అదే గందరగోళం!

వైసీపీలో ఇంకా అదే గందరగోళం!
X

ఈ మధ్య కాలంలో ఏ పేరు మీద కూడా ఇంత రచ్చ...చర్చ జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ మావిగన్ ప్రతిపాదన రాష్ట్రంలో పెద్ద దుమారమే రేపింది. తెలుగు దేశంతో పాటు కూటమి పార్టీలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు..ఎద్దేవా చేశారు అంటే ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వైసీపీ సానుభూతిపరులుగా గుర్తింపు పొందిన వాళ్ళు కూడా జగన్ ప్రతిపాదన చూసి అవాక్కు అయ్యారు. అసలు ఇదెక్కడి ప్రతిపాదన...ఇదేమి పేరు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. చూస్తుంటే జగన్ చేసిన ఈ మావిగన్ ప్రతిపాదన వైసీసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి కు కూడా నచ్చినట్లు లేదు. ఆయన శనివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చర్చ చేయాల్సింది జగన్ చెప్పిన పేరు మీద కాదు...ఆ ప్రతిపాదన ప్రజలకు మేలు చేస్తుందా లేదా అన్నది ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. అంటే సజ్జల కూడా మావి గన్ పేరు మిస్ ఫైర్ అయింది అనే విషయాన్ని అంగీకరించినట్లు అయింది అనే చర్చ వైసీపీ నేతల్లో సాగుతోంది.

మరో వైపు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలకు వుడా, తుడా, ముడా అని పేర్లు పెట్టారు అని...ఇండస్ట్రియల్ కారిడార్ల పేరులు మరింత విచిత్రంగా ఉంటాయి అంటూ మావి గన్ అంశంపై సాగుతున్న ట్రోలింగ్ ను కవర్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో సమస్యలు అన్నీ వదిలేసి అమరావతి హంగామా చేస్తున్నారు అని సజ్జల విమర్శించారు. మూడు ప్రాంతాల్ని పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు అని ఆరోపించారు. రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అమరావతి అంశంపై రాష్ట్రమంతా సంబరాలా అని ప్రశ్నించారు. అందుకే ప్రజలు చంద్రబాబు సంబరాల పిలుపును తిరస్కరించారు అని చెప్పారు. మరో వైపు మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ అమరావతి తమకు శాసన రాజధాని మాత్రమే అని.. తాము ఇక్కడ లక్ష పది వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చుచేస్తామన్నారు.

అమరావతికి తాము వ్యతిరేకం కాదు...అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అంటూ...అమరావతి తమ ప్రయారిటీ కాదు అని చెప్పారు. చంద్రబాబు అమరావతి పనులు జాప్యం చేస్తే తాము ఇంకో ఆలోచన చేస్తామన్నారు. బొత్స మాటలు చూస్తుంటే అమరావతి శాసన రాజధాని అని చెపుతున్నారు అంటే ఇంకా జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్లాన్ లైవ్ లో ఉంది చెప్పదలుచుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు తెర మీదకు తీసుకువచ్చిన మూడు రాజధానుల నినాదం వదిలేసి...పార్లమెంట్ లో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మావి గన్ ప్రతిపడిన తెరపైకి తెచ్చి తీవ్ర విమర్శలు మూటకట్టుకున్నారు.

Next Story
Share it