Telugu Gateway
Andhra Pradesh

జగన్ ప్రయోగం ఫలితానిస్తుందా?!

జగన్ ప్రయోగం ఫలితానిస్తుందా?!
X

నినాదం ఏది అయినా రాజకీయ పార్టీ టార్గెట్ గెలుపే. ఇప్పుడు అధికార వైసీపీ వై నాట్ 175 అంటున్నా...అసలు సంగతి ఏంటో ఆ పార్టీ నేతలకూ తెలుసు. అందుకే ఆ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ‘మార్పు’లకు శ్రీకారం చుడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్పులు మరింత పెద్ద ఎత్తున ఉంటాయనే సంకేతాలు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటి అంటే జగన్ చేసే ఈ ‘మార్పులకు’ జనం మార్కులు వేసి పాస్ చేస్తారా?. లేక వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్నే మారుస్తారా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే జగన్ ప్రయోగం విజయాన్ని ఇవ్వటం అంత ఈజీ కాదు అని వైసీపీ నేతలే స్పష్టం చేస్తున్నారు. దీనికి పలు కారణాలను వాళ్ళు ఉదహరిస్తున్నారు. అందులో ప్రధానమైనది కొంత మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అడ్డగోలుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలను పార్టీ బాధ్యతలు చూసే నేతలు అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినా కూడా...ఎలాగూ నెక్స్ట్ టికెట్ ఇవ్వంకదా అని తేల్చేయటంతో పార్టీ బాద్యులు కూడా మౌనంగా వెనక్కిరావటం తప్ప చేసేది ఏమి లేకపోయింది. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంటే జగన్ సీఎం అయిన తర్వాత ఆరోపణలు వచ్చిన ఒక్క ఎమ్మెల్యే పై సీరియస్ అయినట్లు...పద్ధతి మార్చుకోమని ఆదేశించినట్లు ఎక్కడా కనపడలేదు. పార్టీ సమావేశాల్లో మాట్లాడినా కూడా అది కేవలం పార్టీ ఇచ్చిన కార్యక్రమాల అమలులో వెనకబడ్డ వారి విషయంలో తప్ప...ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వారిని హెచ్చరించిన దాఖలాలు లేవు అనే చెప్పాలి.

ఈ లెక్కన చూస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తే టికెట్ నిరాకరిస్తారు తప్ప...ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పే ప్రయత్నం చేయలేదు అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ కి పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇది ఒకటి అయితే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన చోటును వదిలిపెట్టి వేరే నియోజకవర్గాలకు వెళ్లే నేతలు ఇప్పటికిప్పుడు అక్కడ పట్టు సాధించి విజయం సాధించటం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇప్పటివరకు అక్కడ ఉన్న నేతలు సహకరించటం కూడా అనుమానమే. ఎన్నో సవాళ్లు కొత్తగా నియోజకవర్గం మారే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవేమి కాదు...కేవలం జగన్ ను చూసి ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకుంటే...ఆ పని మరి పాత నియోజకవర్గంలో కూడా చేయాలి కదా?. ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మార్పులు భారీగా ఉంటే..తమకు టికెట్ ఇవ్వకపోయినా సరే పార్టీ చెప్పిన వారిని గెలిపిద్దాం అనేంత ఉదార హృదయం కలిగినవారు రాజకీయాల్లో అతి తక్కువగా ఉంటారు అనే చెప్పాలి. అయినా వ్యతిరేకత ఒక్క ఎమ్మెల్యేల విషయంలోనే ఉంటదా...మొత్తం ప్రభుత్వ పనితీరుపై ఉండదా అని కొంతమంది నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కారు పలు విషయాల్లో ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అటు కేంద్రంతో ...ఇటు నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో ఉన్న కెసిఆర్ సర్కారుతో ఎంతో సఖ్యతతో ఉండి కూడా విభజన సమస్యల పరిష్కారం, హామీల సాధనలో జగన్ సర్కారు విఫలం అయిన విషయం తెలిసిందే. ఇవన్నీ వదిలేసి ప్రజలు జగన్ చేసే మార్పులకు మార్కులు వేసి గెలిపిస్తారు లేదా అన్నది తేలాలంటే వేచిచూడాల్సిందే.

Next Story
Share it