Telugu Gateway
Andhra Pradesh

నియంత్రిత పాలన...నియంత్రిత ఫీడ్ !

నియంత్రిత పాలన...నియంత్రిత ఫీడ్ !
X

ఎన్నికలప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీ కి పెద్ద ఎత్తున మీడియా లో ప్రచారం రావాలని కోరుకుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో కీలక నేతలు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుల సభలకు వాళ్లే మీడియా ను వాహనాలు ఏర్పాటు చేసి మరీ వెంట తీసుకెళతారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విషయం. ఎన్నికల సమయంలో ఇది కాస్త మరింత పెరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఎంతో మంచి చేసిన తాను కాక ఇంకెవరు గెలుస్తారు అనే ధీమా చూపిస్తున్న వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ తన బస్ యాత్ర సందర్భంగా మీడియా ను ఏ మాత్రం దగ్గరకు రానివ్వటం లేదు. జగన్ నిత్యం చెప్పే ఆయన వ్యతిరేక మీడియా విషయంలోనే ఇలా చేస్తున్నారు అనుకుంటే పొరబడినట్లే. అసలు జగన్ సభలు తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ అనే పార్టీ ఒకటి ఉంది అని గుర్తించకుండా వ్యవహరిస్తున్న ఛానళ్ల పరిస్థితి కూడా అదే. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ బస్ యాత్ర లో కీలక ఘట్టాలతో పాటు ప్రతి రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభల కంటెంట్ ను కూడా ఐ ప్యాక్ ఏర్పాటు చేసిన టీం లు తీసి ఇస్తే వాటిని వేసుకోవాల్సిందే. జగన్ సభ లైవ్ చూస్తే అది ప్రసారం చేసే ఏ టీవీ లో అయినా సరే ఒకే విజువల్స్ కనిపిస్తాయి తప్ప మార్పు ఉండదు. ఎందుకంటే లైవ్ ను కూడా కంట్రోల్ చేసి ఇచ్చిన ఫీడ్ మాత్రమే ప్రసారం చేయాల్సి ఉంటుంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అస్మదీయ చానెల్స్ గా ప్రచారం లో ఉన్న వాళ్ళ సిబ్బంది అయినా సరే సొంతంగా కెమెరాలు పెట్టి వీడియో లు తీయటానికి లేదు అని తేల్చేశారు. అదే సమయంలో ఐ ప్యాక్ టీం ప్రతి సమావేశానికి రెండు రోజుల ముందు ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్లాన్ అంతా సిద్ధం చేస్తుంది అని..సీఎం జగన్ కొంత మందితో నిర్వహించే సమావేశాలు అన్ని కూడా స్క్రిప్ట్ ప్రకారమే సాగుతున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

పార్టీ తరపున బటయకు వచ్చే వీడియో లు సోషల్ మీడియా టీం, ఐ ప్యాక్ బృందాల ఆమోదం తో మీడియా ఛానెల్స్ కు చేరటం..టెలికాస్ట్ చేయటం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పెన్షన్ల వివాదం తలెత్తినప్పుడు కొంతమంది వృద్ధులను మంచాల మీద కూర్చోబెట్టి ఎండలో బయట తిప్పి వాటిని వీడియో లు తీసి ఛానెల్స్ కు పంపినట్లు ఒక వైసీపీ నేత వెల్లడించారు. ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అని తెలిపారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలన అంతా కేంద్రీకృతంగానే సాగింది. ఏ నిర్ణయం అయినా అది పెద్దదా..చిన్నదా అని సంబంధం లేకుండా అది ఏది అయినా సరే జగన్ దగ్గర నుంచి రావాల్సిందే. రాజకీయంగా తమకు నష్టం చేస్తుంది అని తెలిసినా తాము బటన్ మోడ్ పాలనకు నిర్ణయం తీసుకున్నట్లు ఒకసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మీడియా ముందు కూడా వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో పాలనతో పాటు అవినీతి అంతా కూడా కేంద్రీకృతంగానే సాగింది అనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో కూడా అది అస్మదీయ చానెల్స్ అయినా తాము ఇచ్చిన ఫీడ్ తీసుకోవాలి తప్ప సొంత కెమెరాలను అనుమతించకపోవటంతో మరీ ఇంత దారుణమా అన్న చర్చ సాగుతుంది. దీనికి ప్రధాన కారణం సీఎం అయిన తర్వాత జగన్ పెద్దగా ఎప్పుడు ప్రజల్లోకి వచ్చింది లేదు...వాళ్ళ సమస్యలు విన్నది లేదు. బటన్ నొక్కే కార్యక్రమాలు...లేదా ఏదైనా సభలు ఉన్నప్పుడు మాత్రమే జగన్ బయటకు వచ్చారు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో ఆయన అటు పార్టీ నేతలు, ప్రజలతో వ్యవహరించిన తీరుకు..జగన్ తీరుకు ఏ మాత్రం పోలిక లేదు అనే చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా సాగుతుంది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థల ప్రతినిధుల విషయంలో కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. జగన్ అయితే ఈ విషయంలో అందుకు పూర్తి బిన్నం అనే చెప్పొచ్చు.

Next Story
Share it