Telugu Gateway
Andhra Pradesh

ఒక్క ఎస్ ఎఫ్ టి నిర్మాణ వ్యయమే తొమ్మిది వేలా?!

ఒక్క ఎస్ ఎఫ్ టి నిర్మాణ వ్యయమే తొమ్మిది వేలా?!
X

చంద్రబాబు, మంత్రి నారాయణ అండదండలతో అడ్డగోలు రేట్లకు ఓకే

కేంద్రం విచారణ జరిపిస్తే బుక్ అవుతాడు అంటున్న ఐఏఎస్ లు !

స్థలం లేకుండా కేవలం నిర్మాణానికే చదరపు అడుగుకు నాలుగు వేల రూపాయలు ఖర్చుపెట్టారు అంటేనే చాలా చాలా ఎక్కువ. ఎలాంటి డిజైన్ అయినా సరే అద్భుతంగా ఈ రేట్ తో భవనాలు నిర్మించవచ్చు. ఇవి ఎవరో కాదు సీనియర్ ఇంజినీర్లు చెపుతున్న లెక్కలు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ లో ఎస్ఎఫ్ టి కి తొమ్మిది వేల రూపాయలు స్థలంతో కలుపుకుని మంచి ప్రీమియం స్పేస్ దొరుకుతుంది. అలాంటిది అమరావతిలో కొత్తగా కట్టే సచివాలయంలో కేవలం నిర్మాణ వ్యయమే దగ్గర దగ్గర 9000 రూపాయలు గా నిర్ణయించారు. అమరావతిలో జరగనున్న అతి పెద్ద స్కాం ల్లో ఇది ఒకటి అని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి . స్థలం లేకుండా కేవలం ఎస్ఎఫ్ టి కి తొమ్మిదివేల రూపాయల వ్యయం అంటే ఈ భవనాలు ఏమైనా బంగారంతో కడుతున్నారా అంటూ ఐఏఎస్ అధికారులే అవాక్కు అవుతున్నారు .

ఒక వైపు ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి కట్టే అమరావతి లో ఇంత పెద్ద ఎత్తున దుబారా వ్యయం చేయటం ఏ మాత్రం సరికాదు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ అండదండలతో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇష్ఠానుసారం చేస్తున్నారు అని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి . తర్వాత ఎప్పుడైనా కేంద్ర విచారణ సంస్థలు ఈ టెండర్ల వ్యవహారంపై దృష్టి పెడితే కన్నబాబు చిక్కుల్లో పడటం ఖాయం అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసే పనుల్లో ఎంతో కొంత అవినీతి ఉండటం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అని..కానీ ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం లెక్కలు మాత్రం ఎవరూ ఊహించలేని రీతిలో ఉన్నాయి అనే చర్చ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మిస్తున్న మొత్తం ఐదు టవర్ల నిర్మాణ వ్యయం 4688 కోట్ల రూపాయలు గా నిర్ణయించారు.

ఈ ఐదు టవర్లను మూడు ప్యాకేజీలుగా ఎవరికీ ఇవ్వాలో కూడా ముందే నిర్ణయించినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ప్రధాని మోడీ అమరావతి పర్యటనకు వచ్చే రోజే ఈ టెండర్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పిలిచే ఏ టెండర్ల లో అయినా ఎక్సెస్ మొత్తం ఐదు శాతం దాటితే ఆ పనులకు అనుమతి మంజూరు చేయకూడదు . కానీ సి ఆర్ డీ ఏ కమిషనర్ మాత్రం ఎంపిక చేసిన కాంట్రాక్టు పనులను ఐదు శాతం ఎక్సెస్ ఉన్న కూడా ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందేలా సహకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ధనం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి తన వంతు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it