Telugu Gateway
Andhra Pradesh

పొత్తుపై పెరుగుతున్న అనుమానాలు!

పొత్తుపై పెరుగుతున్న అనుమానాలు!
X

బీజేపీ ఏ మాత్రం ఇష్టం లేకుండా తెలుగు దేశం తో పొత్తుపెట్టుకున్నట్లు కనిపిస్తోంది. వరసగా చోటుచేసుకుంటున్న ఘటనలు పదే పదే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి ఫైనల్ అయిన తర్వాత తొలి సారి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సీట్ల ప్రకటనలో బీజేపీ చేసిన జాప్యం కూడా కూటమి లోని ఇతర పార్టీలు అయిన టీడీపీ, జనసేన లు పెండింగ్ లో ఉన్న తమ తమ అభ్యర్థులను ఫైనలైజ్ చేయలేక పోతున్నాయి. ఇది రెండు పార్టీల్లో ఒకింత గందరగోళం రేపుతోంది. ఇది ఇలా ఉంటే బీజేపీ రాజ్య సభ సభ్యుడు జీవిఎల్ నరసింహ రావు సోమవారం నాడు విడుదల చేసిన మూడు నిమిషాల వీడియో కూడా బీజేపీ పై పలు అనుమానాలు పెంచేలా చేసింది అనే చెప్పాలి. జీవిఎల్ నరసింహ రావు విశాఖపట్నం నుంచి లోక్ సభ బరిలో నిలవాలని తలచారు. కానీ ఈ సీటు పొత్తులో భాగంగా టీడీపీ కి దక్కింది. ఇక్కడ నుంచి భరత్ ను టీడీపీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. విశాఖపట్నం సీటు తనకు దక్కనందుకు గత నాలుగు రోజులుగా విశాఖపట్నం నుంచి ఎంతో మంది ప్రజలు బాధ పడి...కలత చెంది ఫోన్లు చేశారు అని..విశాఖ అభివృద్ధికి..విశాఖ ప్రజలకు సేవ చేయటానికి మూడు సంవత్సరాలుగా ఎంతో కృషి చేసినట్లు వెల్లడించారు. ఈ సేవ ఎన్నికల కోసం చేసింది కాదు అని..జీవిఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ అన్నారు. విశాఖ అభివృద్ధికి చేసే పనులు ఒక కమిట్మెంట్ తో చేశానన్నారు. అయినా తనకు ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు అన్నారు.

విశాఖ అభివృద్ధికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని....తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని అన్నారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుందామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. కానీ జీవీఎల్ ఎక్కడా కూడా కూటమిలో ప్రధాన పార్టీ గా ఉన్న టీడీపీ తరపున వైజాగ్ లోక్ సభ బరిలో ఉన్న భరత్ కు ఓటు వేయాలని మాట మాత్రంగా అయినా కూడా చెప్పకపోవటం చర్చనీయాంశంగా మారింది. జీవీఎల్ చెపితే ఓట్లు వస్తాయా రావా అన్నది వేరే విషయం. కానీ ఏపీ బీజేపీ లో ఒక కీలక నేతగా ...రాజ్య సభ సభ్యుడిగా ఉన్న ఆయన అధికారికంగా పొత్తు పెట్టుకున్న పార్టీ అభ్యర్థి గురించి ఎన్నికల సమయంలో ఒక మాట కూడా మాట్లాడక పోవటంతో బీజేపీ ఈ కూటమి విషయంలో ఎంత సీరియస్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే ముఖ్యంగా బీజేపీ కి ఓటు ట్రాన్స్ఫర్ జరగటం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ కి ఆరు లోక్ సభ, పది అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మరో వైపు జీవిఎల్ మొదటి నుంచి కూడా అధికార వైసీపీ కి అనుకూలంగా ఉంటారు అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. దీన్ని బలపర్చేలా తాజాగా అయన వీడియో సందేశంలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it