Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సీఎం జ‌గ‌న్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ

ఏపీ సీఎం జ‌గ‌న్ తో ఫ్లిప్ కార్ట్ సీఈవో భేటీ
X

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సీఈవో కళ్యాణ్‌ కృష్ణమూర్తి స‌మావేశం అయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబ‌డుల‌తోపాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు సాగాయి. ప్ర‌ధానంగా రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు, రైతులకు మంచి ధరలు అందేలా చూడటం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరిద్ద‌రూ చర్చలు జ‌రిపారు. రాష్ట్ర వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా ఆర్బీకేలను ప్రారంభించామని, రైతులకు విత్తనం అందించడం దగ్గరనుంచి వారి పంటల కొనుగోలు వరకూ ఆర్బీకేలు నిరంతరం వెన్నుదన్నుగా నిలుస్తాయని సీఎం జ‌గ‌న్ ఈ భేటీలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓకు వివరించారు. రైతులకు పంటలకు మంచి ధరలు వచ్చేలా ఫ్లిప్‌ కార్ట్‌ దోహదపడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. వారి ఉత్పత్తులను కొనుగోలుచేసి వినియోగదారులకు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మంచి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో సహాయపడాలన్నారు. ఎప్పటికప్పుడు ధరల పర్యవేక్షణకు యాప్‌ ఉందని, దాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన తోడ్పాటు అందించాలని కూడా సీఎం కోరారు.

తాము విస్తృతపరుస్తున్న సరుకుల వ్యాపారంలో రైతులనుంచి ఉత్పతులు కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ ముఖ్యమంత్రికి తెలిపారు. ఇది ఉభయులకు ప్రయోజనమన్నారు. మంచి టెక్నాలజీని అందించేలా తమ వంతు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం ఐటీ, ఈ–కామర్స్‌ పెట్టుబడులకు మంచి వేదిక అని, అక్కడ మరిన్ని పెట్టుబడులకు మందుకు రావాలని సీఎం ఫ్లిప్‌కార్ట్‌ను కోరారు. నైపుణ్యాలను మెరుగుపరచడానికి విశాఖలో హై ఎండ్‌ స్కిల్‌యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యమంత్రి జ‌గ‌న్ ప్రతిపాదనలపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ సానుకూలత వ్యక్తంచేశారు. విశాఖలో ఇప్పటికే తమ సంస్థ వ్యాపారాలు చురుగ్గా సాగుతున్నాయని, మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచే ఈ కార్యక్రమాలు మొదలవుతాయన్నారు.

Next Story
Share it