అనుమతి లేకుండా విదేశాలకు

తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడుని ఎన్నికల ముందు ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వైసీపీ సర్కారు అన్ని అస్త్రాలను వాడుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలు లో ఉన్నారు. మరో వైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ స్కాం తో పాటు..అసైన్ మెంట్ భూముల స్కాం వంటి విషయాల్లో చంద్రబాబుపై చర్యలకు అస్త్రాలు సిద్ధం చేసింది. అందుకే ఏసీబీ కోర్ట్ లో పీటి వారంట్స్ పిటిషన్స్ వేసిన విషయం తెలిసిందే. మరో వైపు అమరావతిలో వేల కోట్ల రూపాయల నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలు షాపూర్జీ పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి) ల నుంచి వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఐటి శాఖ కూడా నోటీసు లు జారీ చేసింది. ఈ వ్యవహారం అంతా అప్పటి చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒకసారి శ్రీనివాస్ ఇంటిపై ఐటి దాడులు కూడా జరిగిన విషయం తెలిసిందే.
తాజాగా చంద్రబాబు కు ఐటి శాఖ మరో సారి నోటీసులు జారీ చేసిన సమయంలో పెండ్యాల శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయన ప్రస్తుతం ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అయినా విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలి. కానీ శ్రీనివాస్ అలాంటి అనుమతి తీసుకోలేదు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ముందు షో కాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి స్పందన లేకపోవటంతో పెండ్యాల శ్రీనివాస్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ శ్రీనివాస్పై చర్యలు తీసుకుంది. సీఎస్ జవహర్రెడ్డి ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులనుజారీ చేశారు. సిల్క్ డెవలప్మెంట్ కేసులో శ్రీనివాస్ను కూడా నిందితుడిగా సీఐడీ చేర్చింది.



