Telugu Gateway
Andhra Pradesh

మ‌హా న‌గ‌రాలు లేక‌పోయినా కోవిడ్ ను ఎదుర్కొన్నాం

మ‌హా న‌గ‌రాలు లేక‌పోయినా కోవిడ్ ను ఎదుర్కొన్నాం
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు హైదరాబాద్, బెంగుళూరు, చెన్న‌య్ లాంటి నగరాలు లేక‌పోయినా కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ శుక్ర‌వారం నాడు ప్ర‌ధాని న‌రేంద్రమోడీ దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో నిర్వ‌హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాని ముఖ్యంగా కోవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌ అంశాలపై ప్రధాని సమీక్ష చేపట్టారు. కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ స‌మావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గ‌తంలో లేఖ ద్వారా ప్ర‌స్తావించిన ప్రైవేట్ వ్యాక్సిన్ల‌ను కూడా ప్ర‌భుత్వానికి స‌ర‌ఫ‌రా చేసే అంశాన్ని ప్ర‌స్తావించారు. దీని వ‌ల్ల రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ మ‌రింత వేగంగా సాగే అవ‌కాశం ఉంద‌న్నారు. ''కోవిడ్‌ నివారణలో రాష్ట్రానికి అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు. రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం.

అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు.కాగా రాష్ట్రానికి 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయి. వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగాం. జూలై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. జూలై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కాని క్షేత్రస్థాయిలో చూస్తే వారికి కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. జూన్‌ నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే. ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కోవిడ్‌ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం'' అని జ‌గ‌న్ తెలిపారు.

Next Story
Share it