Telugu Gateway
Andhra Pradesh

ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్

ఇళ్ళ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిన జగన్
X

పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఇళ్ళ పట్టాల పంపిణీ ఎట్టకేలకు శుక్రవారం నాడు ప్రారంభం అయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాల ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పలు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం ప్రారంభం అయింది. ఎంతో మంచి కార్యక్రమం అయిన పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే పచ్చ పార్టీల వారి మొహలు ఎర్రగా మారుతున్నాయని ఎద్దేవా చేశారు. సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, ఆ కారణం చేతనే ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పథకం కింద మొదటి దశలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టనుండగా రెండు దశల్లో 28 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఉచితంగా పూర్తి చేసిస్తామని జగన్ చెప్పారు. 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి 15 రోజుల పాటు పండగలా పట్టాల పంపిణీ చేపడతామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్‌మస్‌ పర్వదినాన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఐదేళ్లలో 30.75 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామన్నారు. దీనివల్ల దాదాపు కోటి 24 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని వ్యాఖ్యానించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందని, మన ప్రభుత్వం కొత్త గ్రామాలను నిర్మించబోతుందన్నారు. ఇవాళ ఇళ్లు మాత్రమే కాకుండా ఊర్లు కడుతున్నామని చెప్పారు. "అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామంటే సామాజిక అసమతుల్యం వస్తుందంటూ టీడీపీ కోర్టుకెళ్లింది.

చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. నిన్న కూడా హైకోర్టులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై పిల్ దాఖలు చేశారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టులో పోరాడుతుంది. త్వరలోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఒక కులం ఉండకూడదని ఎవరైనా అంటారా? అందరూ కలిసి ఉండలేనప్పుడు అది రాజధాని ఎలా అవుతుంది? అందరికీ చోటు ఉంటేనే అది సమాజం అవుతుంది. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అవుతుంది. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లలో జగనన్న స్కీమ్ కావాలా? చంద్రబాబు స్కీమ్ కావాలా? అని సర్వే చేశాం. 1.43 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్‌ అడిగారు. ఆ ఒక్కరికి చంద్రబాబు స్కీమ్‌లోనే ఇల్లు ఇస్తాం. మిగిలిన వారందరికీ జగనన్న స్కీమ్‌లో ఒక్క రూపాయికే ఇల్లు అందిస్తాం" అని సీఎం జగన్‌ అన్నారు.

Next Story
Share it