Telugu Gateway
Andhra Pradesh

పులివెందులకు ఏమిచ్చినా నా రుణం తీరదు

పులివెందులకు ఏమిచ్చినా నా  రుణం తీరదు
X

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని వ్యాఖ్యానించారు. మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న సీఎం రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, డిపోలకు జగన్ శంకుస్థాపన చేశారు. స్థానిక దేవాలయాల అభివృద్ధి, బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు , గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీం, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వచ్చే ఫిబ్రవరిలో వైఎస్ఆర్ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 5 సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు.

యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అదనపు భవనాలను నిర్మిస్తామని తెలిపారు. 'వేంపల్లిలో డిగ్రీ కాలేజీకి నూతన శాశ్వత భవనాలను ఏర్పాటు చేస్తాం. 1256 కోట్ల రూపాయలతో మైక్రో ఇరిగేషన్ పనులు చేపడుతున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం రాదు. గత 15 ఏళ్లలో లెక్కలు చూస్తే 20-25 రోజుల మాత్రమే పూర్తిస్థాయి నీరుంది. పులివెందుల ఆర్డీసీ డిపో పనులు డిసెంబర్ 25న ప్రారంభం కానున్నాయి. గండి వీరాంజనేయ క్షేత్రంలో గర్భాలయం, ధ్వజస్తంభం పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. గండికోటలో రిజర్వాయర్‌లో 26 టీఎంసీల పూర్తిసామర్థ్యాన్ని ఎప్పుడూ నింపలేదు. రూ.665 కోట్లతో పునరావాసం చెల్లించి 26.85 టీఎంసీల నీటిని నింపాం. రూ.247 కోట్లు ఆర్అండ్ ఆర్ కింద ఇచ్చి చిత్రావతిలో 10.13 టీఎంసీల నీటిని నింపాం. గండికోట, చిత్రావతి నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి త్యాగాల వల్లనే లక్షలాది రైతులకు మేలు జరుగుతుంది. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నాను. ' అన్నారు.

Next Story
Share it