Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు కేసు ల తిప్పలు !

జగన్ కు కేసు ల తిప్పలు !
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ఏడాది ముందు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల ముందు ఎంతో కీలకంగా మారిన కేసు లే ఇప్పుడు మరో సారి హాట్ టాపిక్ గా మారటం రాజకీయంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఆ రెండు కేసు ల తో వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఇవి కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పెట్టేవే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా జగన్ కు నష్టం చేసే అవకాశం ఉందనే చర్చ వైసీపీ వర్గాల్లో కూడా ఉంది. ఎందుకంటే తొలుత ఈ కేసు లో సిబిఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దు అనటం...తర్వాత ఈ హత్య కేసు లో టీపీడీ అధినేత చంద్రబాబు పాత్ర ఉంది అనే తరహాలో నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కూడా స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ఈ హత్య వెనక బయటి వ్యక్తుల ప్రమేయం ఉంది అంటూ చెప్పారు. కానీ ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం వై ఎస్ కుటుంబానికి దగ్గరి బంధువులు కావటం విశేషం. వివేకానంద రెడ్డి హత్యకు కుటుంబ వివాదాలే కారణం అని ఒక సారి...తాజాగా వై ఎస్ వివేకా ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడం వల్లనే హత్యకు కారణం అని కోర్టు లో సైతం ప్రస్తావించారు.

సిబిఐ ఇప్పుడు ఈ కేసు లో ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి తో పాటు అయన తండ్రి భాస్కర్ రెడ్డి పై పలు ఆరోపణలు చేస్తోంది. సిబిఐ విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు అన్ని జగన్ కు నైతికంగా , రాజకీయంగా ఇబ్బండి కలిగించే అంశాలే అనే చర్చ సాగుతోంది. మరో కీలక కేసు కోడి కత్తి కేసు. ఇందులోనూ కీలక ట్విస్ట్ లు వస్తున్నాయి. ఈ కేసు ను విచారించిన కేంద్ర విచారణ సంస్థ ఎన్ఐఏ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదు అని, జగన్ చెపుతున్నట్లు ఇంకా లోతైన విచారణ అవసరం లేదు అని..ఇప్పటికే తాము అన్ని కోణాల్లో విచారణ చేసినట్లు పేర్కొంది. సీఎం జగన్ పై దాడి చేసిన శ్రీను వెనక ఎవరో ఉన్నారు అనటానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే జగన్ సీఎం అయిన ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ కూడా తనపై జరిగిన దాడి గురించి ప్రత్యేక దృష్టి పెట్టిన దాఖలాలు లేవని..ఇది కూడా అనుమానాలు పెరగటానికి ఒక కారణంగా ఉంది అని ఒక వైసీపీ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఎన్ఐ ఏ ఛార్జ్ షీట్ వేసి ..కేసు ఫైనల్ అయ్యే సమయంలో మరింత లోతైన దర్యాప్తు అంటూ జగన్ పిటిషన్ వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు సానుభూతి వచ్చేందుకే తాను ఈ దాడి చేసినట్లు శ్రీనివాస్ ఎన్ఐ ఏ కు స్టేట్ మెంట్ ఇవ్వటం కూడా ఇందులో కీలకంగా ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో మరో సారి ఈ రెండు కేసు ల చుట్టూ తిరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it