Telugu Gateway
Andhra Pradesh

విజ‌య‌వాడ‌లో ఎన్ వి ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు

విజ‌య‌వాడ‌లో ఎన్ వి ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు
X

హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు జ‌రిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయన్నారు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ వి ర‌మ‌ణ‌. ఇది అవ‌స‌రం కూడా అని పేర్కొన్నారు. ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో‌ పని చేస్తే ఎవ‌రూ కోర్టుకు రానవసరం‌లేద‌న్నారు. పరిధి దాటితే... కోర్టులు జోక్యం చేసుకుంటాయ‌న్నారు. ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాల‌న్నారు. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయాలని భావిస్తున్నా అంటూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ వి ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 1983 నుంచి విజయవాడతో త‌న‌కు ఎంతో అనుబంధం ఉంద‌ని ఎన్ వి రమణ తెలిపారు. శ‌నివారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వి రమణ మాట్లాడుతూ 'ఈ పురస్కారం నాకు ఓ హెచ్చరిక లాంటిది. నా బాధ్యత మరింత పెరగడంతో పాటు తెలుగువాడి గౌరవాన్ని నిలపెట్టడానికి కృషి చేస్తాను. నాకున్న పరిమితుల మేరకు న్యాయం అందేలా చూస్తా.

రోటరీ క్లబ్ సభ్యులు సేవలను అభినందిస్తున్నాను. నా గుణగణాలను‌ చూసి నాకు అవార్డు ఇవ్వడాన్ని సంతోషిస్తున్నాను. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాం. నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగంపై పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి.' అని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందుతున్నా... నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నామని తెలిపారు. రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే చాలా అలజడి రేగుతుంది. మేధావి వర్గంగా ఉన్న వారంతా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియ చెప్పాల‌ని ర‌మ‌ణ సూచించారు. అన్ని వ్యవస్థల తరహాలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య‌ ప్రాధాన్యతను మరచిపోతున్నాం. సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. కోర్టుకు వస్తే అర్ధం‌కాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అన్నీ వారికి అర్ధం అయితేనే న్యాయస్థానం అంటే గౌరవం కలుగుతుంది. కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలను జాతీయ స్థాయిలో పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. తాను ఊహించినంత గొప్పగా విజయవాడ పురోగతి సాధించలేదని ఎన్ వి రమణ చెప్పారు. అన్ని రంగాల్లో ఈ నగరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. సాంస్కృతిక, సాహిత్య రంగాలకు వేదిక విజయవాడ. నేడు అవన్నీ కనుమరుగై పోతున్నాయి. తెలుగుభాషను శిధిలం కాకుండా చూసుకోవాలి. ఇంగ్లీషు భాష నేర్చుకోండి... కానీ మాతృభాషతోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్ఠంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు జాతి గొప్ప తనాన్ని అందరకీ తెలియ చేయండి. ఇదే నేను ప్రజలకు ఇచ్చే సందేశంగా స్వీకరించండి.'' అని ఆయన వ్యాఖ్యానించారు. అంత‌కు ముందు ఎన్ వి ర‌మ‌ణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు.

Next Story
Share it