Telugu Gateway
Andhra Pradesh

ఈ లడ్డూ కూడా పాయె!

ఈ లడ్డూ కూడా పాయె!
X

అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికా లో నమోదు అయిన కేసు లు అన్నీ క్లోజ్ అయ్యాయి. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అమెరికా లో అదానీ పై కేసు లు క్లోజ్ కావటంతో ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు అయింది. ఇండియాలో విద్యుత్ ప్రాజెక్ట్ లు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న కీలక నేతలకు...అధికారులకు కలిపి వేల కోట్ల రూపాయల మేర ముడుపులు అప్పగించారు అనే అభియోగాలతో అమెరికాలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తో పాటు సాగర్ అదానీ పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. కీలక సమాచారాన్ని దాచిపెట్టి అమెరికా ఇన్వెస్టర్ల నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు నిధులు సమీకరించాయి అనే కారణంతో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు అమెరికా లో ఈ కేసు లు క్లోజ్ కావటంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా పూర్తి సేఫ్ జోన్ లోకి వచ్చినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. తెలుగు దేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ఒప్పందాల్లో గోల్ మాల్ జరిగింది అని...దీని వల్ల రాష్ట్ర ప్రజలపై ఏకంగా 25 సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని ఆరోపణలు చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాదు...జగన్ మోహన్ రెడ్డి తమకు సెకి ఒప్పందాల విషయంలో లడ్డులా దొరికాడు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయం పై మరింత లోతుగా విచారణ జరిపిస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. పేరు కు ఇది సెకి ఒప్పందం అయినా కూడా ఇందులో ఎక్కువ విద్యుత్ సరఫరా చేసేది అదానీ గ్రూప్ కంపెనీలు కావటంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా చేసిన విమర్శలు...ఆరోపణలు అన్ని పక్కనపెట్టి వీటిని కొనసాగించడానికే నిర్ణయం తీసుకుంది. ఒక వైపు ఈ ఒప్పందం వల్ల ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పిన చంద్రబాబు సర్కారు...ఈ ఒప్పందాలు రద్దు చేసుకుంటే దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పుకొచ్చారు.

చివరకు ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడినా పర్వాలేదు...ప్రభుత్వం మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు కట్టలేదు అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. వాస్తవానికి ఈ ఒప్పందం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది అదానీ కంపెనీలు కావటంతోటి చంద్రబాబు సర్కారు ఈ విషయంలో హ్యాండ్సప్ అన్నది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఎందుకంటే ప్రధాని మోడీకి అదానీ అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. దీంతో జగన్ కు ఈ ఒప్పందాలు వల్ల భారీ ప్రయోజనం కలిగింది అని...తమకు స్పష్టమైన ఆధారాలతో లడ్డులా దొరికాడు అని చెప్పి కూడా ఇప్పుడు అసలు ఏమీ తెలియనట్లు అంతా గప్ చుప్ గా పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు అమెరికా లో అదానీ కేసులు క్లోజ్ కావటంతో ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సేఫ్ అయినట్లే అనే చర్చ సాగుతోంది. దీంతో తిరుపతి లడ్డూ కేసే కాదు...సెకి లడ్డూ కేసు కూడా క్లోజ్ అయినట్లే. అటు కేంద్రంలోని మోడీ సర్కారు తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు సర్కారు కూడా పలు కేసు ల విషయంలో జగన్ ను రక్షించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది అనే చర్చ టీడీపీ వర్గాల్లో కూడా ఉంది.

Next Story
Share it