Telugu Gateway
Andhra Pradesh

ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు

ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు
X

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు వైసీపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ నేత‌ల అవినీతిని క‌ప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. ప‌ద్ద‌తి మార్చుకోక‌పోతే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. కొంత మంది పోలీసు అధికారులు కూడా ఇష్టానుసారం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం నాడు చింత‌ల‌పూడిలోని దూళిపాళ న‌రేంద్ర నివాసానికి వెళ్ళి ఆయ‌న్ను ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే నరేంద్రను అరెస్ట్ చేశారని విమ‌ర్శించారు. ధూళిపాళ్ల నరేంద్రది రాజకీయ చరిత్ర గల కుటుంబమని అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. రైతులకు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, నరేంద్ర ఎనలేని సేవలు చేశారని చెప్పారు. అలాంటి కుటుంబానికి చెందిన నరేంద్రను అరెస్టు చేయటం దుర్మార్గమని అన్నారు.

సహకార రంగం నుంచి కంపెనీ చట్టంలోకి సంగం డెయిరీ చట్ట ప్రకారమే వెళ్లిందని తెలిపారు.పోలీసులు కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. తీవ్రవాదులను తీసుకెళ్లినట్లు అరెస్టు చేశారని విమ‌ర్శించారు. భవిష్యత్తులో ఓ రోజు వస్తుందని... అప్పుడు వాళ్ల‌కూ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అచ్చెన్నాయుడితో మొదలైన అరెస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నాయకుడు తప్పు చేస్తే ఎక్కడ చేశారో చెప్పాలని, కనీసం సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ''నరేంద్ర ఆస్తులు గతంలో ఎంత ఇప్పుడు ఎంతో చూడండి...2004కు ముందు జగన్ కుటుంబ ఆస్తులు, ఇప్పుడు ఆస్తులు చూడండి'' అని తెలిపారు. నరేంద్రకు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ధర్మం కోసం న్యాయం కోసం ప్రజలు కూడా అండగా నిలవాలన్నారు. ప్రజల కోసమే వైసీపీ అరాచకాలు భరిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

Next Story
Share it