Telugu Gateway
Andhra Pradesh

మౌన ప్రేక్షకుడిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మౌన ప్రేక్షకుడిలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్
X

అమరావతి రైతులే కాకుండా...ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కూడా ఈ సారి రాజధాని అమరావతి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ సారి అమరావతి విషయంలో గతానికి భిన్నంగా సానుకూలంగా స్పందించటం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఊరట అనే చెప్పాలి. ఎప్పుడైతే కేంద్రం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల రుణంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం ఇప్పించటానికి అధికారికంగా ఓకే చెప్పిందో అప్పుడే ఈ సారి రాజధాని పూర్తి కావటం పక్కా అన్న అభిప్రాయం కలిగింది. అనుకున్న దానికన్నా కొంత ఆలస్యంగా రాజధాని అమరావతి పనులు ప్రారంభం అయ్యాయి. ఇక నుంచి ఈ పనుల్లో స్పీడ్ పెరగనుంది. మే 2 న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత ఈ పనుల వేగం మరింత పెరగటం ఖాయం అని చెపుతున్నారు. ఇంత వరకు ఎలాంటి వివాదాలు లేవు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రి నారాయణ వరకు అమరావతి అనేది స్వయం సమృద్ధి ప్రాజెక్ట్ అని...రాజధాని అభివృద్ధి చేయగా మిగిలిన భూములను విక్రయించి అప్పు తీర్చేస్తామని అంటూ ఎన్నో సార్లు చెప్పారు.

కానీ ఇప్పుడు మాత్రం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణలు అత్యాశతో రాజధాని అమరావతి తో ప్రమాదకర ఆటలు ఆడుతున్నారు అనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముందు అనుకున్నట్లు ఇప్పుడు ఉన్న చోట అమరావతి అభివృద్ధి అయితే రైతులతో పాటు ఆ ప్రాంతం అంతా అద్భుతంగా మారిపోతుంది అని ప్రచారం చేశారు . ఎప్పుడైతే అటు ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వచ్చి పనులు ఖచ్చితంగా పూర్తి అవుతాయి అన్న ధీమా వచ్చిందో అప్పుడే అత్యాశతో అటు చంద్రబాబు, ఇటు నారాయణలు అదనపు భూమి విషయాన్ని తెరమీదకు తెచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని ఒక సీనియర్ మంత్రి వెల్లడించ్చారు . గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పేరుతో వేల ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున ప్రయోజనం పొందటం కోసమే ఇప్పుడు ఈ కొత్త రాగం అందుకున్నారు అని చెపుతున్నారు.

అమరావతి పనులు పూర్తి అయితే చాలు రైతుల రిటర్న్బుల్ ప్లాట్స్ రేట్స్ పెరుగుతాయి అని చెప్పిన చంద్రబాబు, నారాయణలు ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, స్పోర్ట్స్ సిటీ వస్తే తప్ప రేట్లు పెరగవు అన్న చందంగా కొత్త వాదన తెర మీదకు తీసుకురావటం ఈ ప్లాన్ లో భాగంగానే జరుగుతోంది అని చెపుతున్నారు . ఎయిర్ పోర్ట్ తరహాలోనే స్పోర్ట్స్ సిటీ వెనక కూడా భారీ స్కెచ్ ఉంది అన్నది అధికార టీడీపీ నేతలు చెపుతున్న మాట. అందుకే మంత్రి నారాయణ అమరావతి లో జనం ఉండాలి అని...జనం ఉండాలి అంటే ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే ఐటి పరిశ్రమలు పెద్ద ఎత్తున రావాలంటూ చెపుతున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది అని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ను ఉదాహరణ చూపెడుతున్నారు. హైదరాబాద్ లో అసెంబ్లీ నుంచి చూస్తే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ మంత్రి నారాయణ మాత్రం ఎయిర్ పోర్ట్ రాజధానిలో ఉంటే తప్ప అసలు అమరావతి పరిశ్రమలు రావు అన్న చందంగా పదే పదే ప్రజల మెదళ్లలో నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత చేసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్యం గా అమరావతి కి ఐటి దిగ్గజాలు రావటం అన్నది అంత ఈజీ గా జరిగే పని కాదు అని..ఉమ్మడి రాష్ట్రంలోనే వైజాగ్ లో ఐటి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు చేపట్టినా పెద్దగా విజయం సాదించలేకపోయినట్లు ఈ వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన ఐఏఎస్ అధికారులు చెపుతున్నారు. మంత్రి నారాయణ చెపుతున్నట్లు ఎయిర్ పోర్ట్ వస్తే చాలు...ఐటి కంపెనీలు అమరావతికి ఆలా వచ్చి వాలిపోతాయి అని చేస్తున్న ప్రచారం వెనక పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకు సేకరించాలి అనే ఆలోచన తప్ప మరొకటి కాదు అని అధికారుల అభిప్రాయం.

ఒకప్పుడు అసలు రాజధానికి 35 వేల ఎకరాల భూమి ఎందుకు అని మాట్లాడిన జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉన్నారు. వాస్తవానికి అమరావతి విషయంలో ప్రస్తుతం ఎలాంటి వివాదం లేదు అని...టెండర్లలో చోటు చేసుకుంటున్న గోల్ మాల్ వ్యవహారాలు...చంద్రబాబు, నారాయణలు కొత్తగా చెపుతున్న భూ సమీకరణ, సేకరణ విషయాలతోనే కొత్తగా ఏమైనా సమస్యలు వస్తే రావొచ్చు అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్ కింద అదనంగా సేకరించ తలపెట్టిన భూమి ఇవ్వటానికి ముందుకు రాకపోతే భూ సేకరణ చట్టం ప్రకారం ముందుకు వెళ్తాము అని మంత్రి నారాయణ పదే పదే చెపుతూ ఆ ప్రాంత రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా ఉంది. ఒక రకంగా ఇది రైతులను బెదిరిస్తున్నట్లు ఉంది అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో కూడా ఉంది.

Next Story
Share it