Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబులో మార్పుకు ఇది సంకేతమా!

చంద్రబాబులో మార్పుకు ఇది సంకేతమా!
X

విజయవాడ లో మంగళవారం నాడు జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. వేదికపై చంద్రబాబు కోసం ఇతర నేతలతో పోలిస్తే కొంత ప్రత్యేక కుర్చీ వేశారు. ఇది గమనించిన చంద్రబాబు అక్కడ ఉన్న సిబ్బందిని పిలిచి..పవన్ , పురేందేశ్వరి లు కూర్చున్న తరహా కుర్చీనే తనకు కూడా వేయాలని..ప్రత్యేక సీటు వద్దు అని చెప్పారు. వెంటనే సిబ్బంది చంద్రబాబు సీటు మార్చారు. ఇది లైవ్ లో కూడా ప్రసారం అవ్వటం తో ఇది చూసిన వాళ్ళు ఎక్కువ మంది చంద్రబాబు గతంతో పోలిస్తే మారిపోయినట్లు ఉంది అనే వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో మూడు పార్టీ లు కూటమిగా పోటీ చేసి..కనీవినీ ఎరుగని విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.

చంద్రబాబు ను ఎన్డీఏ పక్ష నేతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తే...బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురేందేశ్వరి బలపర్చారు. చంద్రబాబు నలిగిపోయారు అని..జైలు లో ఆయన్ను చూశాను..మంచి రోజులు వస్తాయని చెప్పాను...వచ్చాయి. మీకు మనస్ఫూర్తిగా నా శుభాకంక్షాలు ..అద్భుతమైన పాలన ఇవ్వాలని కోరారు అంటూ కోరారు పవన్. కూటమి పక్ష నాయకుడుగా ఎన్నికైన తర్వాత మాట్లాడిన చంద్రబాబు పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. రాజధాని అమరావతి మాత్రమే అని..అదే సమయంలో విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. కర్నూలు తో పాటు ఇతర నగరాలను కూడా ప్రగతిపధంలో నడిపిస్తామన్నారు.

అయితే నాయకులు అందరూ అహంకారం వదిలి...బాధ్యతతో వ్యవరించాలని కోరారు. గత ఐదేళ్లుగా అరాచక పాలనతో తప్పు చేసిన వాళ్ళకి చట్ట పరం గా శిక్ష పడాల్సిన అవసరం ఉంది అని, అదే సమయం లో విధ్వంస, కక్ష రాజకీయాలకి దూరం గా ఉండాలన్నారు. తప్పు చేసిన వాళ్లపై చర్యలు లేకపోతే అది వాళ్లకు అలవాటుగా మారిపోయే అవకాశం ఉంది అన్నారు చంద్రబాబు. కూటమిని రికార్డు స్థాయిలో గెలిపించిన ప్రజలకు అందరం కలిసి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హోదా ఏంటో రేపు వెల్లడిస్తాం అని...తాను, పవన్ కళ్యాణ్ సామాన్యులమే అని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సాధించిన అద్భుత ఫలితాలతో మనకు ఢిల్లీ లో కూడా విలువ పెరిగింది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story
Share it