ఈడీ ఇటు వైపు చూడదా..ఈ స్కాంను పట్టించుకోదా!

దీని వెనక ఉన్న మతలబు ఏంటి!
కాకినాడ పోర్ట్ లో వాటాల బదిలీకి సంబంధించిన వివాదంలో ఏపీ సిఐడి అలా కేసు నమోదు చేసిందో లేదో ఇలా వెంటనే కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. తెలంగాణాలో బిఆర్ఎస్ హయాంలో సాగిన ఈ ఫార్ములా రేస్ విషయంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు అయిన వెంటనే కూడా కూడా ఈడీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అతి పెద్ద లిక్కర్ స్కాం విషయంలో మాత్రం అటు ఈడీ తో పాటు కేంద్రానికి చెందిన విచారణ ఏజెన్సీ లు ఏవీ కూడా దృష్టి సారించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బీజేపీ పెద్దలు ఇంకా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు అటు కేంద్రంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన లు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా కూడా కేంద్రం మాత్రం సంచలనం సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం విషయంలో చూసీచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం లోక్ సభ సాక్షిగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఏపీ లో జరిగిన లిక్కర్ స్కాం ఢిల్లీ స్కాం కంటే ఎన్నో రేట్లు పెద్దది అని చెపుతూ ఈ విషయంలో ఈడీ, సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విచారణ సంస్థలు లిక్కర్ స్కాం లో డబ్బులు ఎలా చేతులు మారాయో కూడా తేల్చాయి ...ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి ని కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కాం లో 3600 కోట్ల రూపాయల మేర స్కాం జరిగినట్లు చెపుతున్నారు. ఎలా చూసిన ఇది ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఇది ఎంతో పెద్దది అని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే ఇప్పటి వరకు ఈడీ ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దల వద్ద జగన్ పరపతి ఎలా ఉందో అర్ధం అవుతోంది అనే చర్చ సాగుతోంది. త్వరలోనే బీజేపీ లో చేరతాడు అని ప్రచారం ఉన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా లిక్కర్ విధానం రూపకల్పనలో ఎవరెవరు పాల్గొన్నారో కూడా తేల్చిచెప్పారు.
హైదరాబాద్ లోని తన నివాసంలో, విజయవాడ లో జరిగిన లిక్కర్ పాలసీ మీటింగ్ లో తన తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి , వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ , కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి లు రెండు మీటింగ్ లో పాల్గొన్నట్లు చెప్పారు. అసలు ప్రభుత్వ లిక్కర్ విధానంతో ఏ మాత్రం సంబంధము లేని వ్యక్తులు పాలసీ తయారీలో కీలక భాగస్వాములు అయినట్లు విజయసాయిరెడ్డి అధికారికంగా చెపుతున్నా కూడా కేంద్రం ఇవేమి పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించటం లేదు. మరో వైపు కేవలం నగదుగానే తీసుకున్న లిక్కర్ డబ్బులు బినామీ కంపెనీలు, సూట్ కేసు కంపెనీల రూపంలో చేతులు మారినట్లు చెపుతున్నా కూడా కేంద్రం మాత్రం ఇది తమకు పట్టదు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఈ విషయంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీ లు నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయటం లేదు.