Telugu Gateway
Andhra Pradesh

బీజేపీ రాజ్య సభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ

బీజేపీ రాజ్య సభ అభ్యర్థిగా పాకా  వెంకట సత్యనారాయణ
X

రాజకీయాల్లో సహజంగా ఏదైనా లెక్క ప్రకారమే నడుస్తాయి. అసెంబ్లీ లో ఆయా పార్టీ లకు ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగానే రాజ్య సభ సీట్లు దక్కుతాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఆ లెక్కలు ఇక్కడ ఏమి పని చేయవు అన్న చందంగా ఉంది పరిస్థితి. అదెలా అంటే కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో ఏకంగా రెండు రాజ్య సీట్లు దక్కించుకోబోతుంది . మొన్నటి ఎన్నికల్లో టీడీపీ , బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేశాయి . అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి . అయితే వరసగా బీజేపీ కి కేటాయిస్తున్న రాజ్య సభ సీట్ల వ్యవహారం మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇవి అన్ని కూడా వైసీపీ కి చెందిన సీట్లే. ముందే వైసీపీ ఎంపీలతో మాట్లాడుకుని వాళ్ళతో రాజీనామాలు చేయించి ఆంధ్ర ప్రదేశ్ లోని పార్టీలు రాజ్య సభ సీట్లు పంచుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి నలుగురు రాజ్య సభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇందులో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్, కృష్ణయ్య, విజయసాయి రెడ్డి ఉన్నారు. మోపిదేవి సీటు ను టీడీపీ తీసుకుని సానా సతీష్ కు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీద మస్తాన్ రావు రాజీనామా చేసినా మళ్ళీ టీపీడీ నుంచి తన సీటును తానే తీసుకున్నారు. ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్య సభకు రాజీనామా చేసి...తర్వాత బీజేపీ నుంచి తిరిగి ఏపీ నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే.

ఇటీవల రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి సీటు కూడా ఇప్పుడు బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఎవరూ ఊహించని రీతిలో బీజేపీ అధిష్ఠానం ఏపీ నుంచి రాజ్య సభకు పాక వెంకట సత్యనారాయణ పేరుని ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. దీంతో కేవలం ఎనిమిది అంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో బీజేపీ రెండు రాజ్య సభ సీట్లు దక్కించుకున్నట్లు అయింది. అయితే ఇది అంతా ముందే ఫిక్స్ చేసుకుని చేస్తున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కారణాలు ఏమైనా కూడా ఈ సారి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి తో పాటు ఇతర ప్రాజెక్ట్ ల విషయంలో సానుకూలంగా స్పందిస్తుండటంతో టీడీపీ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా బీజేపీ కోరిన ప్రతిసారి రాజ్య సభ సీట్ల విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా బీజేపీ కోరిన అన్నిటికి ఒకే చెపుతుంది అని టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. అయితే బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థి పేరు మాత్రం చాలా మంది నాయకులను ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి.

మరో వైపు విజయసాయి రెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయినా సీటు ను తన కుమార్తె కు ఇవ్వాలని కోరగా అధిష్ఠానం నో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్య సభ సీటు విషయంలో స్పష్టత రావటంతో రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి కి బీజేపీ అధిష్ఠానం ఎలాంటి పోస్ట్ ఇస్తుంది అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. పార్టీ లో చేరిన తర్వాత ఆయనకు తమిళనాడు పార్టీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మే- జూన్ నెలల్లోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. రాజ్య సభ సీట్లు అంటేనే ఎంతో ఖరీదు అయిన వ్యవహారం అని అయినా సరే ఇప్పుడు టీడీపీ అధిష్ఠానం కూడా బీజేపీ తో అటు కేంద్రంతో ఉన్న అవసరాల దృష్ట్యా లెక్కలు అన్ని మర్చిపోయి మోడీ , అమిత్ షా ఏది చెపితే దానికి ఓకే అంటున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లో కూడా సాగుతోంది .

Next Story
Share it