'సర్కారు వారి దొంగలు' ..ఇదీ జగన్ కొత్త పథకం
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏపీ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రజల కోసం కాకుండా అవినీతి పరుల కోసం పనిచేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు..ఆయన సర్కారు వారి దొంగలు పేరుతో కొత్త పథకం ప్రారంభించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని తన అవినీతి కేసుల్లో ఉన్న సహనిందితులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే సరస్వతి సిమెంట్స్ లీజు గడువును పెంచారని...ఇప్పుడు ఇండియా సిమెంట్స్ లీజు గడువును ఏకంగా 50 సంవత్సరాల పెంచారన్నారు. అరబిందోకు కాకినాడ పోర్టు, అంబులెన్సుల కాంట్రాక్టు కట్టబెట్టారని.. హెటిరోకు విశాఖలో బేపార్క్ భూములు దారాదత్తం చేశారని విమర్శించారు. రాంకీ ఫార్మా అధినేతను రాజ్యసభకు పంపించారన్నారు.
వాన్ పిక్ నిందితుడు నిమ్మగడ్డ కోసం కేంద్ర మంత్రులతో రాయబారాలు నడిపారని ఆరోపించారు. పెన్నా సిమెంట్స్కు గనుల లీజును 2035 వరకు పొడిగించారన్నారు. తన కేసుల్లో ఉన్న నిందితులను ఏపీకి రప్పించి మరీ పదవులిచ్చారని విమర్శించారు. రాష్ట్ర సంపదను పప్పు బెల్లాల్లా సహ నిందితులకు పంచుతున్నారని అన్నారు. క్విడ్ ప్రో కో-1 సహకరించిన ఎంతో మంది జైలుకెళ్లారని..క్విడ్ ప్రో కో-2కు సహకరించే వారికీ అదే గతి తప్పదని గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వారికి ఉన్నత పదవులు కట్టబెడుతూ..ఆస్తులను దోచిపెడుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.