Telugu Gateway
Andhra Pradesh

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ
X

సుప్రీంకోర్టు ఆదేశాలు వస్తే పాటిస్తాం

ప్రభుత్వ లేఖ సరికాదు

పంచాయతీ అధికారులపై సరైన సమయంలో చర్యలు

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల విషయంలో ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. విస్తృత ప్రజా ప్రయోజనాలు, ఉద్యోగుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. కమిషన్ కు న్యాయవ్యవస్థపై నమ్మకం, విశ్వాసం, విశ్వసనీయత ఉన్నాయి...ఉంటాయి కూడా అని ప్రకటించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని...ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందని తెలిపారు. విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు.

సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ కోరారు. పంచాయతీ రాజ్ కమిషనర్ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉందన్నారు. పంచాయతీ రాజ్ కమిషనర్ పూర్తిగా విఫలమవ్వడం చాలా బాధాకరమని తెలిపారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే నిర్వహిస్తున్నామని అన్నారు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేయడంలో పీఆర్ కమిషనర్ అలక్ష్యంతో ఉన్నారని విమర్శించారు. పీఆర్ కమిషనర్‌పై సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ సూచనలు సహేతుకంగా లేవన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న ప్రభుత్వ సూచనను తిరస్కరిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం తీరు కూడా సరిగా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్ తనకు రాసిన లేఖ తనకంటే ముందుగానే మీడియాకు చేరిందన్నారు. ఆర్టీఐ నుంచి మినహాయింపులున్నా కమిషన్ విషయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల్లో గోప్యత పాటించాల్సి ఉంటుందని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. ఏకగ్రీన ఎన్నికపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ ఉంటుందన్నారు. కలెక్టర్లకున్న తరహాలోనే ఎస్ఈసీకి నిధుల విషయంలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. నిధుల విషయంలో ప్రభుత్వ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కమిషన్ కోరినప్పుడు నిధులు.. సిబ్బందిని సమకూర్చే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జేడీ ఇలా ఎవ్వరూ లేరని.. అయినా ఎన్నికలు జరిపి తీరుతామని తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ తమకు పెను సవాల్ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.

Next Story
Share it