Telugu Gateway
Andhra Pradesh

కెటీఆర్ పై ఏపీ మంత్రుల ఎటాక్

కెటీఆర్ పై ఏపీ మంత్రుల ఎటాక్
X

పొరుగు రాష్ట్రం ఆంధ్ర్ర్రప్ర‌దేశ్ లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ తెలంగాణ ప‌రిశ్ర‌మ‌లు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు స్పందించారు. కెటీఆర్ త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. హైద‌రాబాద్ లో కూడా విద్యుత్ కోత‌లు ఉన్నాయ‌ని..తాను జ‌న‌రేట‌ర్ వేసుకుని ఉన్నాన‌ని తెలిపారు. కెటీఆర్ ఎవ‌రో చెప్పిన మాట‌ల‌పై స్పందించార‌ని..తాను త‌న అనుభ‌వాల‌ను మాత్ర‌మే చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. కెటీఆర్ వాళ్ళ ఘ‌న‌త ఏదైనా ఉంటే చెప్పుకోవ‌చ్చు కానీ..బాధ్య‌త గ‌ల వ్య‌క్తి అలా మాట్లాడ‌టం స‌రికాదన్నారు బొత్స‌. మ‌రో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే కెటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో సింగ‌రేణి ఉంది కాబ‌ట్టి వారికి విద్యుత్ కోత‌లు లేవ‌న్నారు. ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు మాత్ర‌మే కొంత ఇబ్బంది ఉంద‌న్నారు. రోడ్లు కూడా జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాత బాగుచేస్తున్నామ‌ని తెలిపారు.

ఏపీలో ఏమీ బాగాలేదు..తాము ఏదో చేస్తున్నామ‌ని పోల్చి చెపితే తెలంగాణ‌లో ఓట్లు వ‌స్తాయ‌నే భావ‌న‌లో ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు దగ్గ‌ర ప‌డుతున్నాయ‌ని కెటీఆర్ ఇలాంటి మాట‌లు మాట్లాడి ఉండొచ్చ‌ని పెద్దిరెడ్డి తెలిపారు. మ‌రో మంత్రి జోగి ర‌మేష్ కూడా కెటీఆర్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుప‌ట్టారు. కెటీఆర్ ఇక్క‌డ‌కు వ‌చ్చి రాష్ట్రంలో అమ‌లు అవుతున్న ప‌థ‌కాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. వీటిని చూసి తెలంగాణ‌లో కూడా అమ‌లు చేయ‌వ‌చ్చ‌న్నారు. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం కెటీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఉప‌యోగించుకుని అధికార వైసీపీపై విమ‌ర్శ‌ల దాడి పెంచింది. ఏపీలో జ‌గ‌న్ వ‌చ్చిన త‌ర్వాత రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు త‌గ్గ‌టంతోపాటు..రాష్ట్రం అన్ని ర‌కాలుగా నాశ‌నం అయింద‌ని టీడీపీ నేత‌లు దాడి పెంచారు.

Next Story
Share it