అంతిమ లబ్దిదారుణ్ని టార్గెట్ చేస్తుందా?!

కేంద్రంలోని మోడీ సర్కార్ అసలు ఇంతవరకు ఆంధ్ర ప్రదేశ్ లో సాగిన భారీ లిక్కర్ స్కాం వైపు చూడకపోవటమే ఒక పెద్ద వింత. ఎన్నికలకు ముందు స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు పలు ఆధారాలు ఇచ్చి సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కోరిన సంగతి తెలిసిందే. అయినా ఫలితం జీరో . వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని రక్షించేందుకే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ స్కాం విషయంలో స్పీడ్ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఈ కేసు లో వరసపెట్టి అరెస్ట్ లు సాగుతున్నాయి. ఇప్పుడు మరికొన్ని అరెస్ట్ లు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన సొమ్మును షెల్ కంపెనీలు..బినామీ కంపెనీలకు తరలించి రియల్ ఎస్టేట్ తో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అనే ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించిన వివరాలు అందించాల్సిందిగా సిట్ చీఫ్ కు లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే ఈ విషయంలో ఇప్పటికే సిట్ చాలా వరకు ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. మరి ఈ ఆధారాలతో లిక్కర్ స్కాం అంతిమ లబ్దిదారును ఈడీ గుర్తిస్తుందా...లేక ఈ కేసు నుంచి బయటపడేందుకు సహకరిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జగన్ హయాంలో సాగిన ఎన్నో అక్రమాల విషయంలో చూసీ చూడనట్లు వదిలేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. కానీ లిక్కర్ స్కాం విషయాన్ని ఇప్పటి వరకు అయితే సీరియస్ గా నే తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతుంది. చూడాలి ఈ కేసు ను అయినా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంత మేర విజయవంతంగా పూర్తి చేయగలుతుందో. అధికార కూటమి నేతలు అంతా కూడా లిక్కర్ స్కాం లో లబ్ధిదారు జగన్ మోహన్ రెడ్డి మాత్రమే అని అధికారికంగా చెపుతూ వస్తున్నారు.