ఐఏఎస్ అక్రమార్జనకు 'హైదరాబాద్ లో అదనపు లాకర్లు!?'
ఆయన ఏపీలో ఐఏఎస్. అత్యంత కీలకమైన స్థానం. ఇంకేం ఇంకేం కావాలి అంటూ అక్రమార్జన గోదావరి వరదలా వచ్చి పడుతోంది. ఎంతని దాయాలి..ఎక్కడని దాయాలి. ఇదే ఇప్పుడు ఆయనకు పెద్ద సమస్యగా మారింది. అందుకే చేసే ఉద్యోగం ఏపీలో అయినా హైదరాబాద్ లో మాత్రం భారీ భారీ అదనపు లాకర్లు తీసుకుని తన అక్రమార్జనకు వాడుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతా నగదు రూపంలోనే కాకుండా..కొంత బంగారం రూపంలో కూడా మార్చుకుని ఇలా దోచుకున్న డబ్బును దాచుకుంటున్నారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఇలా అదనపు లాకర్లు తీసుకున్న వారిలో ఒక్క ఐఏఎస్ అధికారి మాత్రమే ఉన్నారనుకుంటే పొరపాటే. ఆయనతోపాటు మరో ఇద్దరు ముఖ్య నేతకు చెందిన ఇద్దరు అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. వీరంతా కలిసే ఈ పని చేస్తున్నారు. సెటిల్ మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నందున లాకర్లు కూడా ఇక్కడే తీసుకున్నారని తెలిపారు.
ఈ విషయం ఐఏఎస్ సర్కిల్స్ లోనూ విస్తృతం గా ప్రచారంలో ఉంది. నగదు లావాదేవీలు అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయని వీరు తెలిపారు. ఎందుకంటే ఏపీలో కీలక అంశాలు అన్నీ ఏదైనా సరే ఆయన కనుసన్నల్లోనే జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ లాకర్ల వ్యవహారంపై ఇప్పటికే కొంత మంది ఐటి శాఖకు కూడా ఉప్పందించారని చెబుతున్నారు. ఇదే జరిగి ఐటి శాఖ ఫోకస్ పెడితే మాత్రం ఈ అక్రమార్జన కోటలు బద్దలవుతాయని చెబుతున్నారు. గతంలో కొంత మంది అధికారులపై కేసులు నమోదు అయిన సమయంలో పలు బ్యాంకుల్లో ఉండే వారి లాకర్లను పరిశీలించటంతోపాటు అత్యంత సన్నిహితుల ఇళ్ళలోనూ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.