ఎస్ఈసీ యాప్ కు హైకోర్టు బ్రేక్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాచ్ యాప్ కు హైకోర్టు బ్రేకులు వేసింది. ఎస్ఈసీ తయారు చేసిన యాప్కు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్ పేరుతో ఎస్ఈసీ రమేష్ కుమార్ తాజాగా ఈ యాప్ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.
ఈ యాప్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్కు సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉందా అని ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.