Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో స‌ర్కారు వారి 'సినిమా ఆగింది'

ఏపీలో స‌ర్కారు వారి సినిమా ఆగింది
X

సినిమా ఏదైనా టిక్కెట్లు మేమే అమ్ముతాం. ఎవ‌రైనా మా ద‌గ్గ‌రే కొనాలి అంటూ ఏపీ స‌ర్కారు కొత్త విధానం తీసుకొచ్చింది. ఈ స‌ర్కారు వారి సినిమాను ఏపీ హైకోర్టు ప్ర‌స్తుతానికి అయితే బ్రేకులు వేసింది. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ పోర్ట‌ల్ ను ప‌లు వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకించాయి. అయినా సరే స‌ర్కారు ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కపోవ‌టంతో కొంత మంది హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై ప‌లు విడ‌త‌ల విచార‌ణ అనంత‌రం హైకోర్టు శుక్ర‌వారం నాడు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల మొత్తాన్ని ఆన్‌లైన్ లో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69ని హైకోర్టు నిలిపివేసింది. జీవో నెంబర్ 69 పై హైకోర్టు స్టే విధించింది. దీనిపై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 69 ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుక్ మై షో, మల్టీప్లెక్స్లు విజయవాడ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పిటిషన్లు దాఖలు చేసింది. రెండు రోజులపాటు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఈ కేసును ఈ నెల 27వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుతుందని వెల్లడిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 69ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే టికెట్ల అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని తిరిగి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. ఈ విషయంపై నిర్మాతల మండలి ప్రభుత్వానికి లేఖలు రాసింది. ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో.. జీవో నెంబర్ 69ను సవాల్ చేస్తూ.. మల్టీప్లెక్స్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌, ప్రైవేట్‌, ఆన్‌లైన్‌ విక్రయ సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ వ్యవహారంపై అటు ప్రభుత్వ, ఇటు పిటిషన్ దాఖలు చేసిన వారి తరపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేసి, జూలై 1వ తేదీన ప్రకటిస్తామని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story
Share it