ముగ్గురు ఫైనాన్స్ అధికారులపై ఏపీ సర్కారు వేటు

కీలక సమాచారం మీడియాకు లీక్ చేశారని అభియోగం
ఉద్యోగుల్లో కలకలం
మీడియాకు సమాచారం లీక్ చేశారనే అభియోగంతో ఏపీ సర్కారు అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖలోని ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. విజిలెన్స్ విచారణ జరిపించి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లు, సెక్షన్ ఆఫీసర్లు డి.శ్రీనిబాబు, కసిరెడ్డి వరప్రసాద్ లు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం సచివాలయ ఉద్యోగుల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆర్ధిక శాఖకు సంబంధించి వరసగా పత్రికల్లో వచ్చిన కథనాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని..అత్యంత సున్నితమైన, రహస్యమైన సమాచారాన్ని పత్రికలకు ఈ ఉద్యోగులు చేరవేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు పేర్కొన్నారు.
ఈ సమాచారంతో ప్రచురించిన కథనాల వల్ల ప్రజల్లో ఒకరకమైన భయాందోళనలు ఏర్పడ్డాయని తెలిపారు. నాగులపాటి వెంకటేశ్వర్లు, కసిరెడ్డి వరప్రసాద్ లు డి శ్రీనిబాబుకు సమాచారం చేరవేశారన్నారు. సంబంధిత అధికారి ఆమోదం పొందకముందే ఈ ఆఫీస్ లో ఉన్న కీలక సమాచారాన్ని కసిరెడ్డి వరప్రసాద్ మీడియాకు లీక్ చేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమాచారం విలువ, దాని ప్రాధాన్యత తెలిసి కూడా ఆయన అనధికారికంగా బయటకు పంపారన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్లే కన్పిస్తోందని పేర్కొన్నారు. సస్పెన్షన్ కు గురైన ముగ్గురు సంబంధిత అధికారి అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.