Telugu Gateway
Andhra Pradesh

ఆనంద‌య్య మందుకు అనుమ‌తి

ఆనంద‌య్య మందుకు అనుమ‌తి
X

గ‌త కొన్ని రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఆనంద‌య్య మందుకు సంబంధించి సోమ‌వారం నాడు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టులో ఈ మందుపై విచార‌ణ జ‌రిగింది. ఈ మందుకు అనుమ‌తి ఇచ్చే విష‌యంలో స‌ర్కారు జాప్యం చేయ‌టంపై హైకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. అయితే ఏపీ ప్ర‌భుత్వం కూడా ఈ మందుకు కొన్ని ప‌రిమితుల‌తో అనుమ‌తులు మంజూరు చేసింది. కరోనా రోగులకు ఆనందయ్య మందు ఇవ్వవచ్చంటూ ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇ‍చ్చే పీ, ఎల్‌, ఎఫ్‌ మందులను రోగులు వాడేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే కంట్లో వేసే 'కే' రకం మందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కే మందుకు సంబంధించి విచారణ రిపోర్టు రానందున, ప్రస్తుతం ఈ మందుకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. కంట్లో వేసే చుక్కల మందుకు సంబంధించి నివేదిక రావడానికి మరో రెండు నుంచి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.

ఆ నివేదిక పరీశీలించిన అనంతరం కే రకం మందుపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ మందు వాడ‌కంపై ఎవ‌రికి వారు సొంతంగా ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. కరోనాకు డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూనే.. వ్యక్తిగత విచక్షణ మేరకు ఆనందయ్య మందును వాడుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇచ్చింది. ఆనందయ్య మందులు వాడుతున్నామనే కారణంతో మిగిలిన మందులు ఆపవద్దంటూ ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆనందయ్య మందుల వల్ల హాని కూడా లేదని తేలింది.ఆనందయ్య మందును తీసుకునేందుకు కొవిడ్‌ రోగులు కృష్ణపట్నం రావొద్దని ప్రభుత్వం సూచించింది. రోగుల బదులు వారి కుటుంబ సభ్యులు వచ్చి మందును తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసింది.

Next Story
Share it