Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం

ఏపీలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభం
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ-అమూల్ పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులు లీటర్ కు అదనంగా నాలుగు రూపాయలు అదనపు ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. మార్కెట్‌లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్‌ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో 6551 కోట్ల రూపాయల వ్యయంతో 9899 గ్రామాల్లో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 4.69 లక్షల మందికి పాడి ఆవులు, గేదేల యూనిట్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పాల సేకరణ మొదటి దశ పైలట్ ప్రాజెక్టును ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో ప్రారంభించనున్నారు.

Next Story
Share it