గంటా శ్రీనివాసరావు ట్వీట్ వైరల్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ నేతలు ఎప్పుడూ ఒకటే మాట చెపుతారు. తమ నాయకుడికి ఉన్న విజన్ ఎవరికీ లేదు అని. రాబోయే వందేళ్ల గురించి ఆయన ఆలోచిస్తారు అని. అంత వరకు ఓకే. రాబోయే ఏభై..వందేళ్ల గురించి ఆలోచించటం తప్పేమి కాకపోయినా ప్రస్తుత పరిస్థితులను ఏ మాత్రం గమనంలోకి తీసుకోకపోవటాన్ని మరి ఎలా చూడాలో.మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి . తన ట్వీటును గంటా శ్రీనివాస రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంది రామ్ మోహన్ నాయుడుకు కూడా ట్యాగ్ చేశారు. గంటా శ్రీనివాస రావు ట్వీట్ సారాంశం.
ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ
‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం..ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ - విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.’ అంటూ పేర్కొన్నారు.. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.