సమ్మె నోటీసుతో సహా అన్నీ రేపు తేలుస్తాం
ఏపీలో ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక్కటయ్యాయి. అన్ని వర్గాల ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకు నాలుగు సంఘాలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించాయి. శుక్రవారం నాడు జరిగే సమావేశం తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని..సమ్మె నోటీసు విషయంలో ఏ మాత్రం వెనక్కుతగ్గలేదని ఉద్యోగ సంఘం నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు వెల్లడించారు. గురువారం నాడు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. పీఆర్సీపై జారీ చేసిన జీవోలతో ప్రభుత్వ ఉద్యోగులందరికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నిరసనలతో గురువారం నాడు ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఆర్సికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఉద్యమం సమయంలో కొంత మంది ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పట్ల ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై మాట్లాడే భాష హద్దుల్లో ఉండాలన్నారు. ఉద్యోగులకు సమస్య పరిష్కారం కావాలా? లేక ప్రభుత్వంతో పోరాటం కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.