Telugu Gateway
Andhra Pradesh

ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ

ఎస్ఈసీకి ఏపీ సీఎస్ లేఖ
X

ఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరికి వారు ఎత్తులు పైఎత్తులు వేస్తూ సాగుతున్నారు. శుక్రవారం నాడు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పరిణామాలు ఎన్నో మలుపులు తిరిగాయి. శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ మూడు పేజీల లేఖను ఎస్ఈసీకి పంపారు. అందులో హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్, ఎన్నికలు సాఫీగా సాగేందుకు అటు ప్రభుత్వం, ఇటు ఎస్ఈసీలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించిన విషయాన్ని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేసినందున అప్పటివరకూ నోటిఫికేషన్ జారీ వంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఉద్యోగులు కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికల విధుల నిర్వహణకు సిద్ధంగా లేరన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లేఖలో కోరారు.

''ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అవసరం. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొదటి దఫా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక.. 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ తప్పనిసరని కేంద్రం చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కు వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని'' సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.

Next Story
Share it