Telugu Gateway
Andhra Pradesh

జగన్.. అలా నడిపిస్తున్నారు!

జగన్.. అలా నడిపిస్తున్నారు!
X

‘నేను ఇచ్చింది తీసుకోవాలి. మిగిలిన విషయాలు అన్నీ మర్చిపోవాలి. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్న డ్రైవ్ ఇది. నా పాలనతో మీకు మేలు జరిగిందా లేదా అన్నది ఒక్కటే ఆలోచించండి. నా వల్ల మీకు మేలు జరిగింది అని భావిస్తే అప్పుడు మీరు అందరూ నా కోసం పని చేయాలి. గతంలో ఉన్నది ఇదే బడ్జెట్ ..ఇలాంటి ప్రభుత్వమే. కానీ సీఎం ఒక్కరే మారారు. అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు మీ బిడ్డ జగన్. అప్పుడు రాని డబ్బులు ఇప్పుడు మీకు ఎలా వస్తున్నాయో ఆలోచించాలి. గతంలో కంటే ఇప్పుడే అప్పులు తక్కువ చేస్తున్నాం. ’ జగన్ నోట ఇవే డైలాగులు ఏ మీటింగ్ లో చూసినా . అప్పుల డబ్బులు అయినా...పన్నుల ఆదాయం అయినా పంచుతూ ప్రజలను కేవలం తన ఓటు బ్యాంక్ గా ఎలా మార్చుకుంటున్నారు...జగన్ ఫోకస్ ఎలా ఉంది...ఆ డ్రైవ్ చేస్తున్న తీరు చూస్తే స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో రోడ్లు ఏ మాత్రం బాగా లేకపోయినా...మరే ఇతర మౌలిక సదుపాయాలు లేకపోయినా కూడా ప్రజలు మంత్రులను ప్రశ్నిస్తే డబ్బులు వస్తున్నాయిగా.. అన్నీ కావాలంటే ఎలా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ హామీ గురించి ఎవరూ అడగొద్దు...మాట్లాడొద్దు. జగన్ 25 మంది ఎంపీలను అడిగితే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏకంగా 22 మంది ఎంపీలను ఇచ్చారు. రాజధానిగా అమరావతిని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి తర్వాత మాట మార్చినా కూడా జగన్ మాట ఇస్తే తప్పడు అనే అందరూ నమ్మాలి. అదే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించి..నాలుగేళ్ళ తర్వాత మాకు అప్పటిలో తెలియక హామీ ఇచ్చాం అంటే అందరూ సర్దుకు పోవాలి. చంద్రబాబుకు చేతకాలేదు...మేము వస్తే పోలవరం పరుగులు తీస్తుంది అని చెప్పి...ఒక అడుగు ముందుకు...పది అడుగులు వెనక్కి అన్న చందంగా ఈ కీలక ప్రాజెక్ట్ ను మార్చి వేస్తే జగనే ఈ ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టించాడు అని అందరూ చెప్పాలి.

చంద్రబాబు కేసు ల కోసం రాజీ పడ్డారు అని విమర్శించి..నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రం నుంచి విభజన చట్టంలోని హామీలను సాదించలేకపోయినా జగన్ సక్సెస్ అనే చెప్పాలి. రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం అని లెక్కలు చెప్పుకుంటూ ... పెద్ద వర్షం వస్తే చాలు చెరువులుగా మారే ప్రాంతాలను దీనికి ఎంపిక చేసినా అందరూ ఒకే అనాలి.చివరకు సొంత జిల్లాకు రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ ను కూడా కేంద్రం నుంచి సాదించుకోలేని స్థితి. తెలంగాణతో అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల పంపకం విషయాలు అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం విషయానికి వస్తే జగన్ కు ముందు...జగన్ వచ్చాక అన్న చందంగా మారిపోయిన పరిస్థితి. కీలక బ్రాండ్స్ అన్నీ మాయం అయి....కొత్త కొత్త బ్రాండ్స్ తెరమీదకు తెచ్చి ...దశల వారీ మధ్య నిషేధ హామీకి జగన్ తూట్లు పొడిచారు. అయినా ఎవరూ ఏమి అడగొద్దు. భోగాపురం ఎయిర్ పోర్ట్ లో స్కాం ఉంది అని విమర్శలు చేసి...మళ్ళీ ఏ కంపెనీ పై అయితే ఆరోపణలు గుప్పించారో అదే జీఎంఆర్ కే ప్రాజెక్ట్ కే కట్టబెట్టారు. జగన్ ప్రతి పక్షంలో ఉండగా పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ అని గగ్గోలు పెట్టి..ఇప్పుడు అయన మాత్రం అంతకంటే ఎక్కువ పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. ఇక ప్రచారం విషయానికి వస్తే అటు ప్రకటనల దగ్గర నుంచి ప్రతి పథకానికి ముందు తన పేరు తగిలించుకోవటం ద్వారా దేశంలో ఏ ముఖ్యమంత్రి పేరుపై లేనన్ని పథకాలు ఒక్క ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ పేరుపైనే ఉన్నాయని చెప్పాలి.

Next Story
Share it