Telugu Gateway
Andhra Pradesh

వైజాగ్ క్యాపిటల్ అని..ఇప్పుడు క్యాంపు ఆఫీస్ లు పెడుతున్నారు

వైజాగ్ క్యాపిటల్ అని..ఇప్పుడు క్యాంపు ఆఫీస్ లు పెడుతున్నారు
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పింది వైజాగ్ ను రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తాను అని. కానీ అయన ఇప్పుడు క్యాపిటల్ సంగతి పక్కన పెట్టి క్యాంపు ఆఫీస్ లతో సర్దుకోండి అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంతా ఇప్పుడు అదే పనిలో ఉంది. మూడు రాజధానుల వ్యవహారం సుప్రీం కోర్టు లో పెండింగ్ లో ఉంది. అది ఎప్పటికి కొలిక్కి వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. మరో వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. అందుకే తాము చెప్పిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హామీని అమలు చేయక పోయినా కూడా సీఎం జగన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు వైజాగ్ లో కొన్ని రోజులు ఉండేలా ఏర్పాట్లు చేయటానికి అనువుగా ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేశారు. సామరస్యపూర్వకమైన, రాష్ట్ర సమతుల అభివృద్ధికి వీలుగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సీఎం సమీక్షలు నిర్వహించటానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అని ఆ ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే సీఎం, మంత్రులు , ఉన్నతాధికారులు అక్కడే ఉండాలా?. మరి వెనకబడిన రాయలసీమ ప్రాంతానికి కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేస్తారా?. అది జగన్ అయినా...మరో పాలకుడు అయినా అభివృద్ధి చేయాలి అని ఉండాలే కానీ ఎక్కడ కూర్చుని అయినా ఆ పని చేయవచ్చు. కానీ చేసే పని కంటే తాము ఏదో చేస్తున్నాం అని చెప్పుకోవటానికి ఆరాటపడే వారికే ఇలాంటి తిప్పలు అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇంట్లో నుంచి నెలకు నాలుగైదు సార్లు తప్ప బయటకు రాని సీఎం ఎక్కడ ఉంటే ఏమిటి అని ఒక వైసీపీ నేతే వ్యాఖ్యానించారు.

గత నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న జగన్...తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచే ఇది అంతా చేశారా లేక చేశానని చెపుతున్న అభివృద్ధి ప్రాంతాల్లో అయన, అధికారులు రాత్రిళ్ళు కూడా మకాం వేసి పనులు చేయించారా?. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు అయితే ఈ ఎన్ సి లు, సీఈ లు ఇతర క్యాడర్ వాళ్ళు పనులు చేయించుతారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి లేదంటే కార్యదర్శి పర్యవేక్షిస్తారు. సీఎం లేదా మంత్రి ఆయా ప్రాజెక్ట్ ప్రాధాన్యతను బట్టి సమీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ను అయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అలాంటి వాటికి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (పీఎంయు)లను కూడా ఏర్పాటు చేస్తుంది. అంతే కానీ ప్రతి చోటకు సీఎం వెళ్ళి అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని పనులు చేయించరు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఎద్దేవా చేశారు. జగన్ తాను వైజాగ్ నుంచి పాలనా సాగిస్తానని ..త్వరలోనే అక్కడికి వెళతానని పలు బహిరంగ వేదికల మీద ప్రకటించారు. వ్యవహారం కోర్టు ల్లో ఉండటంతో ఏమి చెప్పాలో తెలియక ఇలా కొత్త కొత్త పేర్లతో వ్యవహారం నడిపిస్తున్నారు అని అయన అభిప్రాయపడ్డారు. అసలు అమరావతి లో ఉండటం జగన్ కు ఏ మాత్రం ఇష్టం లేదు అని...తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ కొనసాగుతున్నారు అని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సాంకేతికంగా చూస్తే సీఎం తనకు నచ్చిన చోట నుంచి పాలనా సాగించవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ రాజధానిగా ఒక ప్రాంతాన్ని పిలవాలి అంటే అంత కంటే ముందు పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి.

Next Story
Share it