Telugu Gateway
Andhra Pradesh

విద్యుత్ స‌మ‌స్య‌పై తాత్కాలిక‌..దీర్ఘ‌కాలిక వ్యూహాలు

విద్యుత్ స‌మ‌స్య‌పై తాత్కాలిక‌..దీర్ఘ‌కాలిక వ్యూహాలు
X

రాష్ట్రంలోని విద్యుత్ సంస్థ‌ల‌కు బొగ్గు సరఫరా స‌మ‌స్య‌లు లేకుండా చూడాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. విద్యుత్‌ కొరత రాకుండా అమలు చేస్తున్న ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమ‌వారం నాడు స‌మీక్ష నిర్వహించారు. మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రెండు ర్యాకులు బొగ్గు అదనంగా వచ్చిందని అధికారులు వివరించారు. జెన్‌కో ఆధ్వర్యంలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని 50 మిలియన్‌ యూనిట్ల నుంచి 69 మిలియన్‌ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్‌ ఇండియా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. బొగ్గు తెప్పించుకునేందుకు సరుకు రవాణా షిప్పులను వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచనలు చేయాలని.. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయని జగన్‌ అన్నారు.

దీని కోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పవర్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నుంచి 170 మెగావాట్ల విద్యుత్‌కూడా అందుబాటులోకి వస్తోందని అధికారులు తెలిపారు. కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుత్‌ ఉత్పత్తి వ్యూహాలపైనా దృష్టిసారించాలని సీఎం అదికారుల‌ను ఆదేశించారు. 6300 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ విద్యుత్‌ఉత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1350 మెగావాట్ల రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.

Next Story
Share it