Telugu Gateway
Andhra Pradesh

ఈ సారి లెక్క తప్పదు

ఈ సారి లెక్క తప్పదు
X

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి సెకండ్ ఇన్నింగ్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నాడు శ్రీకారం చుట్టారు. మూడు రాజధానుల పేరుతో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ ను అటకెక్కించారు. ఒక్క వైసీపీ తప్ప ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న పార్టీ లు అన్నీ కూడా రాజధానికి అమరావతికి ఓకే చెప్పినవే. తొలుత జగన్ కూడా అసెంబ్లీ వేదికగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక అమరావతి అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అమరావతి లో చంద్రబాబుకు సొంత ఇల్లు కూడా లేదు అని..తాను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అంటూ ఆ ప్రాంత ప్రజలను నమ్మించి 2019 ఎన్నికల్లో ప్రయోజనం పొందిన విషయం తెలిసిందే. జగన్ మూడు రాజధానుల నినాదం ఎత్తుకున్నా మొన్నటి ఎన్నికల్లో అటు ఉత్తరాంధ్ర తో పాటు అమరావతి ప్రాంతంలో కూడా వైసీపీ దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన అమరావతికి మళ్ళీ జీవం వచ్చింది. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి 15000 వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించటానికి కేంద్రం అంగీకరించడంతో ఇక రాజధాని పనులు పరుగులు పెట్టనున్నాయి.

శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి లో రాజధాని పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. సిఆర్డీఏ ఆఫీస్ పనులకు తిరిగి ప్రారంభించారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది అనే అమరావతిని రాజధానికి ఎంపిక చేశాం అని..వైజాగ్ ను ఆర్దికగా రాజధానిగా చేస్తామన్నారు. కర్నూల్ లో హై కోర్ట్ బెంచ్ తో పాటు పరిశ్రమలతో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా చేపట్టే పనులకు టెండర్లు పిలిచి డిసెంబర్ నుంచి రాజధాని పనుల వేగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతి పనులను మూడేళ్ళలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఫస్ట్ టర్మ్ లో చేసినట్లు కాకుండా ఈ సారి రాజధాని పనులు పూర్తి చేయటం రాజకీయంగా కూడా టీడీపీ కి ఎంతో కీలకం. ఈ సారి కేంద్రం అండదండలు ఉండటంతో రాజధాని పక్కాగా పూర్తి అవుతుంది అనే ధీమా అందరిలో ఉంది. ఇప్పుడు ఏ రాజధాని పనులను అనుకున్న ప్రకారం పూర్తి చేయించాల్సిన బాధ్యత చంద్రబాబుదే.

Next Story
Share it