Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు

ఏపీలో మూసేసిన డెయిరీలన్నీ అమూల్ కు లీజు
X

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలతోపాటు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని పేర్ని నాని తెలిపారు. .ఉదయం 6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి. 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మే 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేయనున్నామని... దీనివల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. దీంతోపాటు పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు.. మే 25న వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు జమ. దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి.

మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నగదు జమ. వేట.కెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం.ఏడవ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. ''పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం'' అని తెలిపారు. పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. ''2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది'' అని మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌ మెంట్‌, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.

ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌ దారులకు కూడా భూ సేకరణ పరిహారం. రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. ప్రతి పాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం. ఏలేరు-తాండవ లింక్ కెనాల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ''కోవిడ్‌ కట్టడికి ప్రజలు స్వీయనిర్బంధం పాటించాలి. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు 81.66 శాతం హెల్త్‌ వర్కర్లకు.. 76 శాతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌'' చేశాం అని మంత్రి తెలిపారు.

Next Story
Share it