Telugu Gateway
Andhra Pradesh

రాజధాని..రియల్ ఎస్టేట్ మార్కెట్ కు స్పష్టత

రాజధాని..రియల్ ఎస్టేట్ మార్కెట్ కు స్పష్టత
X

ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో రాజధానిగా అమరావతి ని ప్రకటించటంతో ఈ ప్రాంతంలో ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి పోయాయి. దీంతో ప్రవాస భారతీయులతో పాటు హైదరాబాద్ లో ఉండే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు కూడా ఎవరి రేంజ్ లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో అమరావతి ప్రాజెక్ట్ అటకెక్కిన విషయం తెలిసిందే. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులే కాకుండా..అక్కడ రాజధాని వస్తుంది అని పెట్టుబడులు పెట్టిన వారు కూడా భారీ ఎత్తున నష్టాలు చవిచూశారు. తొలుత అమరావతి కి మద్దతు పలకటమే కాకుండా ..రాజధాని రైతులకు చంద్రబాబు కంటే ఎక్కువ మేలు చేస్తానని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నినాదం అందుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఎన్నికల సమయంలో కూడా అధికార వైసీపీ మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లగా..టీడీపీ కూటమి ఒకే రాజధాని అమరావతి నినాదంతోనే ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఒక దిశ, దశ రావాలంటే అది ఎన్నికల ఫలితాల తర్వాతే అన్న విషయం తెలిసిందే. అందుకే అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది అంచనా వేస్తున్నట్లు...ప్రచారంలో ఉన్న విధంగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి తో పాటు ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒకింత బూమ్ కు ఛాన్స్ ఉంటుంది అని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే హైప్ క్రియేట్ చేయటంతో పాటు మార్కెట్ చేయటంలో చంద్రబాబు స్టైల్ ఉపయోగపడుతుంది అని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. మరో కీలక విషయం ఏమిటి అంటే కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తన తొలి టర్మ్ లో చేసిన తప్పు మళ్ళీ చేయకుండా అమరావతి లో కీలక నిర్మాణాలు అన్ని పూర్తి చేస్తారు అని టీడీపీ వర్గాలు కూడా చెపుతున్నాయి. ఎవరు అదికారంలో ఉన్నా కూడా రాజధాని ని కదిలించకుండా పనులు పూర్తి అవుతాయి అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. వైసీపీ అధినేత, సీఎం జగన్ చెపుతున్నట్లు ఈ ఎన్నికల్లో కూడా తిరిగి వైసీపీ గెలిస్తే రియల్ ఎస్టేట్ ఫోకస్ అంతా కూడా వైజాగ్ తో పాటు పూర్తిగా ఉత్తరాంధ్ర వైపు మళ్లటం ఖాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే జగన్ తిరిగి అధికారంలోకి వస్తే న్యాయపరమైన చిక్కులు తొలగించి వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో పాటు మూడు రాజధానుల ను అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఫలితాల కోసం రియల్ ఎస్టేట్ రంగంలోని వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 న వచ్చే ఫలితాలతో అటు రాజధానితో పాటు రియల్ ఎస్టేట్ కు ఒక స్పష్టత రానుంది అనే చెప్పాలి.

Next Story
Share it