Telugu Gateway
Andhra Pradesh

అప్పుడు మట్టి..నీళ్లు...మరి ఇప్పుడు ఏంటి !

అప్పుడు మట్టి..నీళ్లు...మరి ఇప్పుడు ఏంటి !
X

ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఏమి తెస్తారు?. ఇదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. మే 2 న అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీ హాజరు అవుతున్న విషయం తెలిసిందే. 2015 అక్టోబర్ 22 న ప్రధాని మోడీ తొలిసారి అమరావతి శంఖుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. కారణాలు ఏమైనా అప్పటి నుంచి అమరావతి ప్రాజెక్ట్ అనుకున్న స్థాయిలో టేక్ ఆఫ్ కాలేదు. మరో వైపు 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్ ను పూర్తిగా అటకెక్కించి మూడు రాజధానుల నినాదం అందుకున్న విషయం తెలిసిందే. అప్పటికే అమరావతిపై వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉన్నా కూడా జగన్ అదేమీ పట్టించుకోలేదు. అప్పటి సీఎం జగన్ కు అమరావతి అటకెక్కించాల్సిన అవసరం లేదు అనే చెప్పే ఛాన్స్ ఉన్నా కూడా ఆ పని ప్రధాని మోడీ చేయలేదు. పైగా అమరావతికి శంకుస్థాపన చేయటానికి వచ్చిన సమయంలో ప్రధాని మోడీ కూడా మట్టి, నీరు ఇచ్చి వెళ్లారు.

ఇదే అంశంపై తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిని విశ్వనగరంగా అభివృద్ధి చేస్తానని చెప్పి మట్టి, నీరు ముఖాన కొట్టిన వారికి తమ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ఆయన 2019 ఏప్రిల్ 1 న ఒక ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు తో పాటు పవన్ కళ్యాణ్ లు కూడా మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వాళ్లే. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. మొన్నటి ఎన్నికల్లో కలిసి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత పాత విషయాలు అన్ని నేతలు అందరూ మర్చిపోయారు. అసలు ఇప్పుడు అమరావతి పనుల పునః ప్రారంభానికి రెండవసారి ప్రధాని మోడీని పిలవటంపై అమరావతి రైతులతో పాటు పలు వర్గాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ఏపీ కి చెందిన కొంత మంది బీజేపీ నాయకులు అమరావతికి రెండవ సారి మోడీ ని పిలవటం సరికాదు అనే అభిప్రాయంతో ఉన్నారు. అంతర్గత సంభాషణల్లో ఇదే విషయాన్ని వాళ్ళు చెపుతున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రారంభం అయిన అమరావతి పనుల పునః ప్రారంభానికి మోడీ ని తీసుకొచ్చి ఏదో ఒక ప్రకటన చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. చంద్రబాబు పిలిస్తే పిలిచి ఉండొచ్చు..మోడీ ఎలా వస్తున్నారు అనే చర్చ కూడా ఉంది.

గతానికి బిన్నంగా ఈ సారి కేంద్రం రాజధాని పనులు పరుగులు పెట్టేలా ప్రపంచ బ్యాంకు తో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు ఇప్పించటంతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ అయింది అని చెప్పటానికి ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మోడీ సర్కారు ఈ అప్పులు ఇప్పించకపోతే మాత్రం అమరావతి ముందుకు కదిలేదు కాదు. కేంద్రం నుంచి అందుతున్న సాయం కారణంగానే ఈ టర్మ్ లో అమరావతి ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది అనే నమ్మకం చాలా మందిలో వచ్చింది. అయితే మరి అమరావతి పనుల పునః ప్రారంభానికి వస్తున్న ప్రధాని మోడీ ఈ సారి ఏమి తెస్తారు...ఏమి చెపుతారు అన్నది అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం.

Next Story
Share it