Telugu Gateway
Andhra Pradesh

'ఆ న‌లుగురి 'కి అద‌న‌పు భ‌ద్ర‌త‌

ఆ న‌లుగురి కి అద‌న‌పు భ‌ద్ర‌త‌
X

ఏపీ స‌ర్కారు ఆ న‌లుగురికి అద‌న‌పు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాల అనంత‌రం వీరిపై దాడుల‌కు ఛాన్స్ ఉంద‌నే అనుమానంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రిపై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిపై కొంత మంది సోష‌ల్ మీడియా వేదిక‌గా బెదిరింపుల‌కు దిగారు. దీంతో ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఈ నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగానే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు భద్రత పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. .మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్ మెన్లను భద్రతగా ప్రభుత్వం ఇచ్చింది. కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది.

దీంతో కొడాలి నానికి 7+7 భద్రత ఉండనుంది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్‌లతో పాటు అదనంగా 3+3 గన్‌మెన్ భద్రతను ప్రభుత్వం ఇచ్చింది. ఇకపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు 4+4 భద్రత ఉండనుంది. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా అందిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వారి భద్రతను సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమీక్షించింది. అనంతరం తక్షణం భద్రత కల్పిస్తూ ప్రభుత్వం బుధ‌వారం నాడు నిర్ణయం తీసుకుంది. స‌త్వ‌ర‌మే ఈ ఆదేశాలు అమల్లోక వ‌స్తాయ‌న్నారు.

Next Story
Share it